గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల భేటీలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే హస్తం నేతుల వాగ్వాదానికి దిగారు వీహెచ్, షబ్బీర్ అలీ.
హైదరాబాద్ లోని గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల భేటీలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే హస్తం నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు ఇద్దరు నేతలు. పార్టీలో అసలైన నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు వీహెచ్. పార్టీలో ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. వీహెచ్ అలిగి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ బంద్ కు పిలుపు ఇచ్చిన క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలో 21వ తేదీన ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ నోటీసులో లేకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ్మ ప్రకటించడం పట్ల వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. మంగళవారం గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ కు వచ్చిన క్రమంలో ఆయన నేతృత్వంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వీహెచ్ అంటున్న సమయంలోనే..తాము పీసీసీ అధ్యక్షుడికి చెప్పిన తర్వాతే ఈ కార్యక్రమానికి పిలుపు ఇచ్చామని షబ్బీర్ అలీ చెబుతూ వీహెచ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీహెచ్, షబ్బీర్ అలీ మధ్య మాటా మాట పెరిగి సీరియస్ గా గొడవ జరిగింది. అయితే కొంతమంది నాయకులు వ్యక్తి గత ప్రతిష్టను పెంచుకునేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వీహెచ్ అనడంతో మిగిలిన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో సమావేశాన్ని బహిష్కరించి వీహెచ్ బయటికి వెళ్లారు. కొంతమంది నేతలు.. బయటి నుంచి వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని చూస్తున్నారని ..ఇది ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదన్నారు. పార్టీ సీనియర్ గా ఉన్న, లాయల్ గా పని చేసేవారికి మాత్రమే ఇవ్వాలని చెప్పారు.