తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు. ఏపీ ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని.. అప్పటి ఘటనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని మోడీ అన్నారు. బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని.. జమ్మూ కశ్మీర్ను కూడా విభజించామన్న మోడీ.. ఎక్కడా ఏ సమస్యా రాలేదన్నారు. పూర్తిగా చర్చించిన తర్వాతే బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నామని మోడీ చెప్పారు.
‘తెలంగాణ ఏర్పడినప్పుడు సభలో వాతావరణం ఎలా ఉంది? సభ తలుపులు మూసేశారు. ప్రత్యక్ష ప్రసారం ఆపేశారు. చప్పట్లు మోగలేదు. ఆ విభజన ఎలా ఆమోదం పొందిందనే విషయం ఎవరూ మర్చిపోలేదు. దశాబ్దం తర్వాత ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం మీకు వచ్చింది. అందర్నీ కలుపుకుని ఏర్పాటు చేయాల్సింది. అన్ని పక్షాల వారినీ మీరు సంప్రదించారని అంటున్నారు. కనీసం ఆంధ్రా తెలంగాణ వాళ్లనైనా వాళ్ల అభిప్రాయం ఏంటో అడగాల్సింది.
కానీ మీరు చేసింది చరిత్ర మర్చిపోదు. ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్.. లోక్సభలో ఒక మాట అన్నారు. దాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ కోసం వరుస ఆందోళనలతో ప్రజాస్వామ్యం విలవిలలాడిందన్నారు. వాజ్పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలను సంపూర్ణ శాంతి, గౌరవంతో ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాలు దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్ లద్దాక్ పునర్విభజన సంపూర్ణ, సుదీర్ఘ చర్చల తర్వాత ఏర్పడ్డాయి’ అని అన్నారు.