ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 01వ తేదీ మంగళవారం టి క్యాబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించింది. తమ సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్ 05 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో.. వారి డిమాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణరావు, సునిల్ శర్మ సభ్యులుగా సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీని నియమించింది.
ఈ కమిటీ అక్టోబర్ 02వ తేదీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చించనుంది. వారి డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత తొందరలో నివేదిక ఇవ్వనుంది. అధికారులు ఇచ్చే నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకొనుంది. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున.. సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రి మండలి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని.. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని క్యాబినెట్ సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని.. ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు దిగి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది. మరి క్యాబినెట్ సూచనలు, నేడు జరిగే సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.