హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల నుండి రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని 19 మినహా మిగతా 12,732 పంచాయతీల్లో ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభించనున్నారు. తొలి విడత పోలింగ్ జనవరి 21న జరుగనుండగా..మధ్యాహ్నం 2గంటల నుండి ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నిక ఉండనుంది.