అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.
అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 9, 2019) రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గవర్నర్ ప్రస్తావించారు. 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు లాంటి అద్భుత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశారని తెలిపారు.
రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం పటిష్టపునాదులు వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.