జర భద్రం : మూడు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

భానుడు భగభగ మండుతు..వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు.

  • Publish Date - March 11, 2019 / 03:51 AM IST

భానుడు భగభగ మండుతు..వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు.

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు ముదురుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖతోపాటు  రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) కూడా హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ..బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 

మార్చి 10న నాగర్‌కర్నూలు,  నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..జగిత్యాల, వనపర్తి తదితర ప్రాంతాల్లో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,  మెదక్, ఖమ్మం జిల్లాల్లో వరుసగా 38, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భద్రాచలం, ఖమ్మంలో శనివారం సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.