టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు. నటుడు శివాజీ, రవిప్రకాశ్ల మధ్య జరిగిన కొన్ని ఈ-మెయిల్ సంభాషణలకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తుంది. శివాజీ, రవిప్రకాశ్ల మధ్య జరిగిన నకిలీ ఒప్పందం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్కు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్టు చెబుతున్నారు.
టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకోగా.. రవిప్రకాశ్కు ఉచ్చు బిగుసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ABCL ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ-మెయిళ్లను రాబట్టారు.
రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్ను వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి, రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకు కాపీలు పంపారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
ఇక శివాజీ NCLT లో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించగా, ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం 9 గంటలకు విజయవాడ అడ్వకేట్కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి.. రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు.
అదే రోజు ఈ పిటిషన్పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41(ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యే అవకాశంను తప్పించుకునేందుకు రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్లో పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం రవిప్రకాశ్ పిటీషన్ తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, NCLTలో జరగబోయే విచారణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.