DMK leader Kanimozhi: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి, ఆ రాష్ట్ర అధికార డీఎంకే పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ రాష్ట్రాన్ని ఏమని పిలవాలో తమకు చెప్పొద్దని డీఎంకే నాయకురాలు, లోక్సభ సభ్యురాలు కనిమొళి అన్నారు. తమిళుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎవరూ మాట్లాడకూడదని ఆమె చెప్పారు. అలాగే, గవర్నర్ పై తమ పార్టీ నేత కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను కూడా తాము సమర్థించడం లేదని అన్నారు.
‘‘అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్న విషయంపై గవర్నర్ కు ప్రభుత్వం పత్రం సమర్పించడం ఆనవాయితీ. దాన్నే గవర్నర్ అసెంబ్లీలో చదువుతారు. తమిళనాడు గవర్నర్ ఇటీవల ఇచ్చిన ప్రసంగం ఆనవాయితీని నాశనం చేసేలా ఉంది’’ అని కనిమొళి చెప్పారు. కాగా, తమిళనాడు రాష్ట్రానికి తమిగళం పేరు బాగుంటుందని ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అన్నారు. దీంతో దీనిపై వివాదం రాజుకుంది.
దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి డీఎంకే, కాంగ్రెస్, వీసీకే పార్టీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. తమిళనాడు అంటే తమిళ భూమి అని అర్థం ఉండడంతో ఆ పేరు సరికాదని కొందరు అంటున్నారు. తమిగళం అంటే తమిళుల నివాసం అనే అర్థం వస్తుండడంతో ఈ పేరు సరైందని జాతీయవాదులు చెబుతుంటారు. తమిళనాడు పేరు దేశాన్ని సూచించేలా ఉందని కొందరు అంటుండడంతో వివాదం కొనసాగుతోంది.