అమెరికాపై చలి పులి పంజా విసిరింది. పలు రాష్ట్రాలు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గడ్డకట్టుకుపోతున్నాయి.
వాషింగ్టన్ : అమెరికాపై చలి పులి పంజా విసిరింది. తీవ్ర చలి వణికిస్తోంది. పలు రాష్ట్రాలు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గడ్డకట్టుకుపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా చలికి తట్టుకోలేక 12 మందికి పైగా మృతి చెందారు. డెట్రాయిట్లో కాలువలన్నీ గడ్డకట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో జలపాతాలు కూడా గడ్డకట్టాయి. మరో 24 గంటలు మైనస్ 29 డిగ్రీల నుంచి మైనస్ 46 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫలితంగా పాఠశాలలు, వ్యాపారాలు మూతపడ్డాయి. విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లను వెచ్చబరిచేందుకు వాడే థర్మోస్టార్ల వాడకాన్ని తగ్గించాల్సిందిగా ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. వృద్ధులు, నిరాశ్రయుల కోసం వందలాదిగా వార్మింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కెనడాలో సైతం మైనస్ మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.