Apple Office: కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ లో కనిపించిన చిన్న ఎన్వలప్ ఆఫీస్ మొత్తం ఖాళీ అయ్యేలా చేసింది. అందులో ఒక వైట్ పౌడర్ ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే శాంతా క్లారా కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడకు వచ్చింది.
అప్పటికి గానీ తెలియలేదు ఆ ఎన్వలప్ లోని తెల్లటి పౌడర్ ఎటువంటి భయంకరమైనది కాదని.
మొదటగా NBC బే ఏరియా ఉద్యోగులు ఎన్వలప్ను, అందులో తెల్లని పౌడర్ గుర్తించారు. వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఉద్యోగులు పారిపోయే ప్రయత్నంలో మునిగిపోయారు. అలా కాసేపటి వరకూ కనిపించిన ఉత్కంఠ పరిస్థితుల తర్వాత ప్రమాదమేమీ లేదని తెలుసుకుని తిరిగి ఆఫీసుల్లోకి అడుగుపెట్టారు.
వారందరికీ మెయిల్ చేసిన యాపిల్.. ఎన్వలప్ లో పౌడర్ ప్రమాదకరమైనది కాదని తేల్చారు. కాకపోతే ఆ పౌడర్ దేనికి సంబంధించిందని కనుగొనే పనిలో పడ్డారు సిబ్బంది. యాపిల్ పార్క్ లో పరిస్థితులు చక్కబడి మళ్లీ పనుల్లో మునిగిపోయారు.
Read Also: బూస్టింగ్ డోస్ తీసుకుంటేనే యాపిల్ ఉద్యోగులకు ఎంట్రీ
ఇదిలా ఉంటే, వచ్చేనెల 11 నాటికి అమెరికాలోని కార్పొరేట్ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని లక్ష్యం నిర్దేశించింది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఆపిల్ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ 2021లో మళ్లీ కరోనా కేసుల ధాటి పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 11 నుంచి వారానికి ఒకరోజు తప్పనిసరిగా ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సిబ్బందికి సీఈవో టిమ్ కుక్ పంపిన మెమోలో పేర్కొన్నారు. మూడు వారాల తర్వాత ప్రతివారంలో రెండు రోజులు, మే 23 నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆ మెమోలో టిమ్కుక్ పేర్కొన్నారు.
కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫైనాన్సియల్, టెక్నాలజీ కంపెనీలతోపాటు సిబ్బందిని ఆఫీసులకు రప్పించేందుకు ఆపిల్ కూడా పోటీపడుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. మరో టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ అనుబంధ గూగుల్ కూడా అమెరికా, బ్రిటన్, ఆసియా-పసిఫిక్ ఆఫీసుల పరిధిలో సిబ్బందిని ఏప్రిల్ 4 నుంచి వారానికి 3 రోజులు ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.