Sheikh Maulvi’s sensational comments : అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీహెచ్డీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ పనికి రావని అన్నారు. ముల్లాలకు ఆ డిగ్రీలేమైనా ఉన్నాయా? అయినా వాళ్లే అందరి కంటే గొప్పవాళ్లు అని అన్నారు. ఇప్పుడు ఏ పీహెచ్డీ డిగ్రీకి, మాస్టర్ డిగ్రీకి విలువ లేదన్నారు. ముల్లాలు, తాలిబన్ లీడర్లకు ఈ డిగ్రీలు కాదు కదా కనీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదని తెలిపారు. కానీ వాళ్లే ఇప్పుడు గొప్పవాళ్లు అని నూరుల్లా అన్నారు.
ముల్లా హసన్ ప్రధానమంత్రిగా మంగళవారం (సెప్టెంబర్7,2021) తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓ ఉగ్రవాది సహా 33 మంది మంత్రులు తాలిబన్ల కేబినెట్లో ఉన్నారు. షరియా చట్టం ప్రకారమే తమ పాలన ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
తాలిబన్ల పైశాచికత్వం పెరిగిపోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించే వారిని, నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని భయబ్రాంతులకు గుర చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలు ప్రపంచానికి తెలియచేసేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులు, మీడియా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
మహిళల నిరసన వార్తను కవర్ చేస్తున్న క్రమంలో..తనపట్ల దారుణంగా ప్రవర్తించారని ఓ జర్నలిస్టు వాపోయారు. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారని, వారి అదుపులో ఉన్నప్పుడు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వార్తను కవర్ చేసినందుకు నేలకు ముక్కు రాయాలని ఆదేశించారని, దీంతో తాను ప్రాణభయంతో ఆ పని చేయడం జరిగిందన్నారు. తన ఐడీ కార్డు, కెమెరా ధ్వంసం చేశారని మరో జర్నలిస్టు వెల్లడించారు.