×
Ad

Drinking Water : నీళ్లు ఎక్కువ తాగినా ముప్పే !

రోజుకు 2 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగాలి. అయితే, ఈ సూత్రం అందరికీ వర్తించదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి ఇతర పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా నీరు చేరుతుందని, మళ్లీ అదనంగా నీళ్లు తీసుకుంటే ముప్పేనని అమెరికా పరిశోధకులు గుర్తించారు.

  • Published On : November 28, 2022 / 07:11 AM IST

drinking water

Drinking Water : ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆహారంతోపాటు నీళ్లు ఎంతో అవసరం. ఆహారం లేకున్నా కొన్ని రోజులు జీవించవచ్చు కానీ నీళ్లు లేకుండా ఉండలేం. శరీరానికి ఆహారం కంటే నీళ్లు అత్యవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు అవసరమైన స్థాయిలో నీళ్లు తాగాలి. సాధారంగా 8 సార్లు 8 ఔన్స్‌ గ్లాసుల చొప్పున నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తారు. దీనినే 8×8 సూత్రం అంటారు.

అంటే రోజుకు 2 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగాలి. అయితే, ఈ సూత్రం అందరికీ వర్తించదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి ఇతర పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా నీరు చేరుతుందని, మళ్లీ అదనంగా నీళ్లు తీసుకుంటే ముప్పేనని అమెరికా పరిశోధకులు గుర్తించారు.

Drinking Water : సరైన మోతాదులో నీరు తీసుకోకపోతే గుండె పోటు సమస్యలు వస్తాయా?

26 దేశాలకు చెందిన 8 రోజుల నుంచి 96 ఏళ్ల వయసున్న 5,600 మందిపై అధ్యయనం చేశారు. వారు రోజులో సరాసరి ఒక లీటరు నుంచి 6 లీటర్ల నీళ్లు తాగుతున్నట్లు తేల్చారు. ఉష్ణోగ్రత, తేమ, నివసించే ప్రాంతం, శక్తి వినియోగం, శరీర బరువు, వయస్సు, శారీరక శ్రమ లాంటి కారకాలు నీటి వినియోగంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు.

వ్యవసాయ ఆధారిత దేశాల్లోని ప్రజలు పారిశ్రామిక దేశాల్లోని ప్రజల కంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నట్లు గుర్తించారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా నీళ్లు తాగుతున్నట్లు పేర్కొన్నారు. అందరికంటే ఎక్కువగా శిశువులు నీళ్లు తాగుతున్నారని, రోజూ వారి శరీరంలోకి 28శాతం నీళ్లు చేరుతున్నట్టు తెలుసుకున్నారు.