అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ స్కూలును సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు ఆహ్వానం పంపకపోవడం వివాదానికి దారి తీసింది.
మెలానియా ట్రంప్ కార్యక్రమంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో వారి పేర్లు లేకపోవడంపై ఆప్ మండిపడుతోంది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి తొలగించారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు కేజ్రీవాల్ ప్రభుత్వం కిందికి వస్తాయి. ఫిబ్రవరి 25న మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూలును సందర్శిస్తారు. హ్యాపినెస్ క్లాస్ను ఆమె ప్రత్యక్షంగా చూస్తారు. మెలానియా ట్రంప్ స్కూలు కార్యక్రమానికి ఆప్ నేతలను ఆహ్వానించకపోవడంపై వస్తున్న విమర్శలపై బీజేపీ స్పందించింది.
ఎవర్ని ఆహ్వానించాలన్నది అమెరికానే నిర్ణయిస్తుందని ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి జోక్యం లేదని బీజేపీ ప్రతినిథి సంబిత్ పాత్రా స్పష్టం చేశారు. అతిథులు భారత్కు వచ్చినపుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఒకరినొకరు కీచులాడుకోవడం ద్వారా భారత్ను వివాదస్పదం చేయొద్దని సూచించారు సంబిత్ పాత్రా.
Read More : పాకిస్తాన్ పౌరసత్వం ఇవ్వాలంటున్న డారెన్ సామీ