కజకిస్థాన్లో 67 మందితో వెళ్తున్న ఓ విమానం కుప్పకూలిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి 25 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వారిలో 22 మందిని ఆసుపత్రికి తరలించినట్లు కజకిస్థాన్ ఎమర్జెన్సీ శాఖ తెలిపింది. మృతుల సంఖ్య గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి చెందిన ఆ విమానం గాలిలో కుప్పకూలి అక్టౌ నగరానికి సమీపంలో పడుతున్న సమయంలో అందులో మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణమేంటన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఎంబ్రేయర్ 190 విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అక్కడి రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. జే2-8243 విమానం అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పొగమంచు కారణంగా విమాన దారిని మళ్లించారని, చివరకు అది కుప్పకూలిందని తెలుస్తోంది. విమానాశ్రయానికి సమీపంలోనే ఆ విమానం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తూ గాల్లో కాసేపు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఆ విమానం పక్షులను ఢీకొనడంతో పాటు స్టీరింగ్ లోపం కారణంగా కూలిపోయినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
BREAKING: Azerbaijan Airlines flight traveling from Baku to Grozny crashes in Aktau, Kazakhstan, after reportedly requesting an emergency landing pic.twitter.com/hB5toqEFe2
— RT (@RT_com) December 25, 2024