Biden Administration Approved $735 Million Arms Sale To Israel
Biden administration Arms Sale Israel : పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఓ వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ఇజ్రాయిల్ దేశానికి అధునాతన ఆయుధాలు సరఫరా చేసే ఒప్పందాన్ని ఖరారు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కచ్చితమైన లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను ఇజ్రాయిల్కు అప్పగించేందుకు అంగీకారం తెలిపింది శ్వేతసౌధం. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయిల్కి 735 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను అమెరికా అందిస్తుంది.
ఇప్పటికే అధునాతన ఆయుధాలతో పటిష్టంగా ఉన్న ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ.. ఈ ఆయుధాల రాకతో శత్రుదుర్భేద్యంగా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో.. ఇజ్రాయిల్కి అమెరికా ఆయుధాలు అందివ్వడంపై టక్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జో బైడెన్ రక్తపు చేతులతో చరిత్ర రాస్తున్నారంటూ మండిపడ్డారు ఎర్డోగన్. మరోవైపు పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది.
దాడులు ఇలాగే కొనసాగిస్తే గల్ఫ్ దేశాల్లో ఇజ్రాయిల్కు మిత్ర దేశమంటూ ఎవరూ ఉండబోరంటూ సౌదీఅరేబియా హెచ్చరించింది. గత పది రోజులుగా ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య నెలకొన్న ఉద్రికత్తలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా హమాస్ నేతలు దాగి ఉన్న భవనాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడిలో ఉత్తర డివిజన్ కమాండర్ హుస్సామ్, అబు హబ్రీద్ మరణించినట్టు ఇజ్రాయిల్ తెలిపింది. అతను పదిహేనేళ్లుగా కమాండర్గా కొనసాగుతున్నాడని ఇజ్రాయిల్ వెల్లడించింది.