బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55) బుధవారం(ఏప్రిల్-29,2020)తండ్రి అయిన విషయం తెలిసిందే. తండ్రి కావడానికి కొన్ని వారాల ముందే ఆయన కరోనా వైరస్ బారినపడి మృత్యువు అంచులు దాకా వెళ్లి ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. దీంతో తన ప్రాణాలు కాపాడిన డాక్లర్ల పేరును తన కొడుకుకి పెట్టి వారి రుణం తీర్చుకున్నారు. ఈ విషయాన్నిశనివారం ప్రధాని ఫియాన్సీ.. కారీ సీమండ్స్(32) ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
కరోనాకు చికిత్స చేసిన డాక్టర్లతోపాటు, తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని తమ కొడుకుకి పేరు పెట్టినట్లు తెలిపారు. సీమండ్స్ తాత లౌరీ.. బోరిస్ తాత విల్ఫ్రెడ్.. జాన్సన్కు వైద్యం చేసి డాక్టర్లు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు
ప్రాణంపోసిన వైద్యుల పేరును తమ కుమారుడికి పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. UCLH(యూనివర్శిటీ కాలేజి లండన్ హాస్పిటల్)లో తమను చాలా బాగా చూసుకున్న జాతీయ ఆరోగ్య వ్యవస్థ(NHS)మెటర్నిటీ టీమ్ కు ధన్యవాదాలు.. సంతోషంతో నా గుండె నిండింది అని ప్రధాని ఫియాన్సీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. మార్చి చివరివారంలో బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా మొదట్లో ఆయన ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు.
అయినా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఏప్రిల్ 7న హాస్పిటల్కు తరలించారు. వైరస్ తీవ్రత పెరగడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సెయింట్ థామస్ హాస్పిటల్ లో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్ హెల్త్ స్టాఫ్కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. వారి సేవలకు కేవలం థ్యాంక్స్ మాత్రమే సరిపోదని, హాస్పిటల్ సిబ్బందే తన ప్రాణాలను కాపాడారని అన్నారు. అన్నట్టుగా థ్యాంక్స్తోనే ఆగిపోకుండా తన బిడ్డకు వైద్యుల పేరునే పెట్టి రుణం తీర్చుకున్నారు.