Afghanistan: ఆహార సంక్షోభం.. అవయవాలు అమ్ముకుంటున్న అఫ్ఘాన్ తల్లిదండ్రులు
ప్రస్తుతం భారత్ నుంచి పంపించనున్న 50 వేల టన్నుల ఆహార దినుసులు తప్ప ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభానికి తెరదించే మార్గం ఏది లేదు.
- Bharath Reddy
- Published On : January 30, 2022 / 10:57 AM IST
Afghanistan
Afghanistan: తాలిబన్ చేతుల్లో చిక్కుకున్న ఆఫ్గనిస్తాన్ లో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఆకలి చావులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘన్ కుటుంబాలు పూట గడవని స్థితిలో పట్టెడన్నం కోసం శరీర అవయవాలను, పిల్లలను అమ్ముకుంటున్నారంటూ ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ముఖ్యకార్యదర్శి డేవిడ్ బేస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలికి తట్టుకోలేక యువకులు, చిన్నారులు బోరు పంపునీళ్లు తగ్గుతున్న దృశ్యాలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. అసలే అరకొరగా పండే పంటలతో ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడు ఆహార కొరత ఉంటూనే ఉంటుంది. అటువంటిది గతేడాది తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం.. దేశంలో వ్యవసాయం మచ్చుకైనా కనిపించలేదు. ఉన్న ఆహార నిల్వలను సైతం తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆఫ్ఘన్ పౌరులు దుర్భిక్షంలో చిక్కుకున్నారు.
Also read: Corona Update: దేశంలో అదుపులోకి మహమ్మారి, కొత్తగా ఎన్ని కేసులంటే?
ఆఫ్ఘన్ పరిస్థితులపై ఐరాస సమీక్షిస్తుంది. దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న ఆఫ్గనిస్తాన్ లో సగానికి పైగా జనాభా కేవలం నీళ్లు, బ్రెడ్ ముక్కలతో కడుపునింపుకుంటున్నారు. అది కూడా ఒక్క పూట మాత్రమే లభిస్తుంది. ఆహారం అందక చిక్కిశల్యమై.. 10 లక్షల మంది చిన్నారులు దేశంలో చనిపోయే స్థితిలో ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు వారి శరీర అవయవాలను అమ్ముకుంటున్నారు. తాలిబన్లకు కట్టుబడి ఎవరైనా జీవితాన్ని నెట్టుకొస్తుంటే.. నిస్సహాయ స్థితిలో వారికి తమ పిల్లలను అమ్ముకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ముఖ్యకార్యదర్శి డేవిడ్ బేస్లీ ప్రపంచ దేశాలకు, మానవతా వాదులకు పిలుపునిచ్చారు.
Also read: Pegasus: మళ్లీ పెగాసస్ ప్రకంపనలు.. ఎన్నికల వేళ ‘యుద్ధం’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ కథనం
ప్రస్తుతం కొన్ని యూరోపియన్, ఆసియా దేశాలకు చెందిన స్వచ్చంద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం అందిస్తున్నాయి. ఇప్పుడున్న కరువు, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ కు మరింత సాయం కావాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాలు ఆఫ్ఘన్ లో శాంతి భద్రతలు, ఆరోగ్య భద్రతకు కొంత సహాయం అందిస్తున్నా.. అవి నామమాత్రంగానే ఉన్నాయి. వైద్యం పరంగా భారత్ గతేడాది నవంబర్ నుంచి దశల వారీగా ఆఫ్ఘనిస్తాన్ కు సాయం అందిస్తుంది. అదే సమయంలో ఆఫ్ఘన్ లో నెలకొన్న ఆహార సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. మానవతాదృక్పథంతో స్పందిస్తూ..సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం భారత్ నుంచి పంపించనున్న 50 వేల టన్నుల ఆహార దినుసులు తప్ప ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభానికి తెరదించే మార్గం ఏది లేదు. ఫిబ్రవరి రెండో వారం నుంచి పాక్ భూభాగం మీదుగా ఈ ఆహార దినుసుల సరఫరా జరగనుంది.
Also read: Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం
ఒక వేళ భారత్ అందించిన సహాయం నేరుగా ప్రజలకు చేరుకుంటే పరిస్థితిని కొంతవరకు చక్కబెట్టవచ్చు. అలాకానీ పక్షంలో భారత్ అందించే ఆహార సహాయాన్ని సైతం తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకుంటే..ఇక ఆఫ్ఘన్ ప్రజలను దేవుడు కూడా కాపాడలేడంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమీప భవిష్యత్తులోనే ఆఫ్ఘనిస్తాన్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం అభివర్ణించింది. ఒక దేశం కనుమరుగవకుండా..సాటి మానవులుగా స్పందిస్తూ ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఐరాస మానవహక్కుల వేదిక పిలుపునిచ్చింది.
Also read: Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు
