sydney : ఆస్ర్టేలియాలోని సిడ్నీ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కార్లన్నీ నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తిప్పలు తప్పడం లేదు.. 1961 తర్వాత ఇంత భారీ ఎత్తున వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. వరదల ధాటికి నగరం నీట మునిగింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు.. ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ను మునుపెన్నడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి.
సిడ్నీ వాసులకు తాగు నీరు అందించే వార్రగంబా డ్యామ్ వరద నీరుతో పొంగిపోర్లుతోంది. 1990 సంవత్సరం తర్వాత రిజర్వాయర్కు ఇంత పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చాయని చెబుతున్నారు. మరోవైపు సాయం చేయాలంటూ తమకు వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది తెలిపారు. తక్షణమే ఆయా ప్రభావిత ప్రాంతాలకు వందలాది రెస్క్యూ టీమ్స్ను పంపించామన్నారు.
వరదల కారణంగా సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది.. పరిస్థితులు మెరుగు పరిన తరువాత ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.. భారీ వర్షాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణశాఖ ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రధాని స్కాట్ మారిసన్ సూచించారు.. అంతేగాకుండా ప్రజలకు పునరావాస సాయం అందిస్తామని ప్రకటించారు.