India Slams Pakistan: పీవోకేలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన.. పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్..
సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు..
- Naveen
- Updated on- November 1, 2025 / 05:58 PM IST
India Slams Pakistan: యూఎన్ వేదికగా పాకిస్తాన్ పై భారత్ నిప్పులు చెరిగింది. పాక్ వైఖరిని ఎండగట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని మండిపడింది. అక్కడ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయింది. ఈ మేరకు భారత దౌత్యవేత్త భావికా మంగళానందన్ యూఎన్ వేదికగా ధ్వజమెత్తారు. పీవోకేలో జరుగుతున్న దారుణాలను ఆపకుండా భారత్పై నిందలు మోపేందుకు పాక్ దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పాకిస్తాన్ కపట వైఖరి అందరికీ తెలుసన్నారు.
పీవోకేలోని కొన్ని ప్రాంతాలలో తమ ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న అనేక మంది అమాయక పౌరులను పాక్ దళాలు చంపేశాయి అని UN మిషన్లో భారత తొలి సెక్రటరీ భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు.
”పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు” అని ఆమె జనరల్ అసెంబ్లీలో ఇస్లామాబాద్ దుష్ప్రచారాలను తోసిపుచ్చారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ దౌత్యవేత్తలు భారత్ పై దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని భావికా మండిపడ్డారు. పదే పదే చేసే ఆరోపణలు, చెప్పే అబద్ధాలు సత్యాన్ని మార్చవు అని ఆమె తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ద్వంద్వ మాటలు, కపటత్వం ఈ గొప్ప వేదికకు అర్హమైనవి కావన్నారు.
Also Read: గోల్డ్ టాయిలెట్ కావాలా..? వేలానికి సిద్ధం.. ప్రారంభ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని చరిత్ర ఇదే..
