India Vs Sri Lanka : శ్రీలంకతో తొలి వన్డే, భారత్ ఘన విజయం
శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
- Naveen
- Updated on- July 18, 2021 / 10:55 PM IST
India Vs Sri Lanka
India Vs Sri Lanka : శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 86 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
అంతకుముందు ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43 రన్స్), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59 రన్స్) దూకుడు ప్రదర్శించారు. మనీష్ పాండే 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో ధనంజయ డి సిల్వా 2 వికెట్లు తీయగా, లక్షన్ సందాకన్ ఒక వికెట్ సాధించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. లంక జట్టులో అత్యధికంగా కరుణరత్నె 43 పరుగులు చేశాడు. 35 బంతులాడిన కరుణరత్నే 43 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ దసున్ షనక 39, చరిత్ అసలంక 38 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్ తలో రెండు వికెట్లు తీశారు. పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 20న ఇదే స్టేడియంలో జరగనుంది.
