US President Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటించారు. కొన్ని నెలల్లో దీన్ని ట్రంప్కు ప్రదానం చేస్తారు.
క్నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్)లో ట్రంప్ ప్రసంగానికి ముందే ఈ ప్రకటన వచ్చింది. గాజా నుంచి బందీల విడుదల, యుద్ధం ముగియడానికి సహకరించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం అందించనున్నట్లు చెప్పారు.
ట్రంప్ ఎంతో కృషి చేసి బందీలను విడిపించడమే కాకుండా భద్రత, సహకారం, శాంతియుత వాతావరణం కోసం మధ్యప్రాచ్యంలో కొత్త యుగానికి పునాది వేశారని హెర్జోగ్ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ ఈ పురస్కారాన్ని 2013లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అందించింది. ఈ సారి నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు ట్రంప్కు అది దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కు రాలేదు. గతంలో ఒబామాకు మాత్రం నోబెల్ లభించింది.
మీకు పీఎఫ్ ఖాతా ఉందా? శుభవార్త..! ఏమేం మారబోతున్నాయంటే? తెలుసుకోవాల్సిందే..
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా సోమవారం ఇజ్రాయెల్, హమాస్ బందీ-ఖైదీల మార్పిడి జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 67,000 మందికి పైగా పాలస్తీనియులు మృతి చెందారు.
“యుద్ధం ముగిసింది” అని ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఇజ్రాయెల్కు వెళ్లే ముందు ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో అన్నారు. ఆ ప్రాంత భవిష్యత్తు గురించి అడగగా.. “ఇది సాధారణ స్థితికి వస్తుందని అనుకుంటున్నాను” అని అన్నారు.
ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం గాజాలో మానవతా సాయం పెరుగుతోంది. మార్చి తర్వాత మొదటిసారిగా వంటగ్యాస్ గాజాలోకి ప్రవేశించగా, ఆహార, వైద్య సరఫరాలు కూడా మరింతగా వస్తున్నాయి.
కాగా, గత వారం ట్రంప్ ప్రతిపాదించిన గాజా 20-పాయింట్ల ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్ ఆమోదించాయి. దీని ద్వారా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి విరామం లభించింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో రూపొందించిన ఈ ప్రణాళికలో.. యుద్ధానికి ముగింపు పలకడం, ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, బందీలను విడుదల చేయడం, గాజాలో స్వీయ పాలన వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.