Jack Ma: జపాన్లో తలదాచుకున్న జాక్ మా.. ఆరు నెలల తర్వాత తెలిసిన చైనా కుబేరుడి ఆచూకి
చైనా ప్రభుత్వ విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పని చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదని, బ్యాంకింగ్ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని జాక్ మా ఆరోపించారు. అంతే జాక్ మాను ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయన సంస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడింది.
- tony bekkal
- Published On : November 30, 2022 / 06:08 PM IST
Jack Ma living in Japan after China tech crackdown
Jack Ma: చైనాలో అత్యంత కుబేరుడిగా పేరొందిన అలీబాబా వ్యవస్థాపకుడు అలీబాబా ఆచూకీ తెలిసింది. ఆరు నెలలుగా కనిపించకుండా పోయిన ఆయన.. జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలిసింది. చైనా ప్రభుత్వంపై విమర్శలు చేసిన అనంతరం నాటి నుంచి కనిపించకుండా పోయిన జాక్ మా.. చాలా కాలం బహిరంగంగా తిరగడమే మానసేిన ఆయన.. కొద్ది కాలం క్రితం ఏకంగా అజ్ణాతంలోకి వెళ్లారు. చైనాను విడిచి వెళ్లినట్లు తెలిసినప్పటికీ ఎక్కడ తలదాచుకున్నారనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఉండేది కాదు. అయితే తాజాగా ఆయన జపాన్లో తన స్నేహితుడి వద్ద ఆశ్రయం పొందినట్లు ఓ వార్తా పత్రిక పేర్కొంది.
తన కుటుంబంతో కలిసి ఆరు నెలలుగా టోక్యోలోనే ఉంటున్నారట జాక్ మా. వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బంది ఆయన వెంట ఉన్నారట. అక్కడి నుంచే ఆయన తరుచూ ఇజ్రాయెల్, అమెరికా పర్యటిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఎలాంటి హడావుడి లేని సాధారణ జీవితం గడుపుతున్నట్లు చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. టోక్యోకు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్కు జాక్ మా సన్నిహిత మిత్రుడు. అంతే కాకుండా అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. ఈయనే జపాన్లో జాక్ మాకు అవసరమైన ఏర్పాట్లు చూసుకున్నారట.
చైనా ప్రభుత్వ విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పని చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదని, బ్యాంకింగ్ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని జాక్ మా ఆరోపించారు. అంతే జాక్ మాను ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయన సంస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడింది. యాంట్ గ్రూప్ ఐపీఓని అడ్డుకుంది. అప్పటి నుంచి చైనాలోని ప్రైవేట్ టెక్ కంపెనీలపై వరుస దాడులు మొదలయ్యాయి. దీంతో ఆయన 2020 నుంచి బహిరంగంగా కనిపించడం మానేశారు. కొద్ది రోజుల క్రితం చైనాను వీడి జపాన్ వెళ్లిపోయారు.
