×
Ad

మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్‌.. ఇప్పటివరకు ఏయే దేశాలు ఇలా..?

డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఆన్‌లైన్‌లో హానికర కంటెంట్‌ నుంచి పిల్లలను కాపాడేందుకు వయస్సు నిర్ధారణ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి.

Malaysia: సోషల్ మీడియాను చిన్న పిల్లలు కూడా తెగవాడేస్తున్నారు. చదువు, వినోదం, సమాచారం పొందడం వంటి అనేక అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తున్న పిల్లలు వారికి తెలియకుండానే వాటికి బానిసలుగా మారుతున్నారు. ఈ వాడకం చిన్న వయసులోనే ఎక్కువైతే పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రవర్తన, చదువుపై దుష్ప్రభావాలు పడతాయి.

సోషల్‌ మీడియాలో వచ్చే నోటిఫికేషన్లు, వీడియోలు, గేమ్‌లు పిల్లల మనసును దారి మళ్లిస్తాయి. దీంట్లో మునిగిపోయిన పిల్లలు చదువులో, రోజువారీ పనుల్లో కాని పూర్తి శ్రద్ధ పెట్టలేరు. సోషల్‌ మీడియా పిల్లల భావోద్వేగాలపై గాఢమైన ప్రభావం చూపుతోంది. స్క్రీన్‌ టైమ్‌ అధికంగా ఉంటే శారీరకంగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. (Malaysia)

కంటి సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి, శారీరక చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చేయాలని ప్రపచంలోని పలు దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాలు ఇటువంటి నిర్ణయమే తీసుకోగా ఇప్పుడు మలేషియా కూడా ఈ లిస్టులో చేరింది. పిల్లల భద్రత దృష్ట్యా 16 ఏళ్ల లోపువాఉ సోషల్ మీడియాలో ఖాతాలు వాడకుండా చేసేందుకు వచ్చే ఏడాది నుంచే బ్యాన్ విధించేందుకు మలేషియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు ఆన్‌లైన్‌ వయస్సు పరిమితులను ఎలా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేస్తున్నామని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫహ్మి ఫజిల్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా చేస్తామని చెప్పారు.

ఇటీవలి సంవత్సరాలలో దేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను నియంత్రించేందుకు మలేషియా సోషల్ మీడియాపై పర్యవేక్షణను పెంచుతోంది. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఎనిమిది మిలియన్లకు పైగా యూజర్లు ఉన్న ప్లాట్‌ఫాంలు లైసెన్స్ తప్పనిసరిగా పొందాలి.

Also Read: గుడ్‌న్యూస్‌.. తిరుపతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌.. ప్రయాణ సమయం ఏకంగా ఎంత తగ్గుతుందంటే?  

పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించాలని మలేషియాలో 72 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం
సెప్టెంబరులో ఐప్సాస్ మలేషియా ఎడ్యుకేషన్ మానిటర్-2025 విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది.

ఇతర దేశాల్లో ఇలా..

ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫాంలు 16 ఏళ్ల లోపు యూజర్ల ఖాతాలను తొలగించాలని, లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని ఇప్పటికే ఆర్డర్లు జారీ చేశారు.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురానున్నారు.

నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ ఏడాది టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను 15 ఏళ్ల లోపు పిల్లలు వాడకుండా చేయాలని సూచించింది.

ఇదిలా ఉండగా, డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ యూనియన్ దేశాలు ఆన్‌లైన్‌లో హానికర కంటెంట్‌ నుంచి పిల్లలను కాపాడేందుకు వయస్సు నిర్ధారణ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి.