వృద్ధులలో కూడా ‘మోడెర్నా వ్యాక్సిన్’ సానుకూల ఫలితాలు

Moderna’s COVID-19 vaccine కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ మోడెర్నా వ్యాక్సిన్ ను తయారుచేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు వృద్ధుల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా మోడెర్నా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు రాబట్టింది. కరోనా మహమ్మారితో తీవ్రమైన ప్రభావానికి గురయ్యే ముప్పున్న వృద్ధులపై కూడా ఈ టీకా బాగా పని చేస్తున్నట్లు ఓ పరిశోధనల్లో తేలింది.


ఈ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులలో కూడా యువతలో మాదిరిగానే వైరస్‌ను చంపే యాంటీబాడీల స్థాయి ఉందని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు న్యూఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు. అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ, ఫార్మా దిగ్గజం మోడెర్నా సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించింది

18-55 ఏళ్ల మధ్య వారిపై మోడెర్నా నిర్వహించిన ఫేజ్‌1 పరిశోధనలకు కొనసాగింపుగా దీనిని నిర్వహించారు. రెండు డోసులుగా వర్గీకరించి ప్రయోగించారు. ఒక డోసు కింద 25 మైక్రోగ్రాములు.. రెండో డోసుకింద 100 మైక్రోగ్రాములను వినియోగించారు. 56-70, 71 నుంచి ఆపై వయస్సు వారిని మరోబృందంగా ఎంచుకున్నారు.


మొత్తం 40 మందిపై దీనిని ప్రయోగించారు. 71 ఏళ్ల పైబడిన 20 మంది వృద్ధులపై 100 మైక్రోగ్రాములను 28 రోజుల తేడాతో ప్రయోగించారు. వీరిలో యువతతో సమానంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఫలితాలు ఆశలు రేకెత్తించేలా ఉన్నాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఇవాన్‌ అండర్సన్‌ తెలిపారు. అయితే టీకా తీసుకున్న కొంత మంది వలంటీర్లకు జ్వరం, అలసట వంటి స్వల్ప ప్రతికూల ప్రభావాలు కనిపించాయని పరిశోధనలో తేలింది.