NASA Moon Base: చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసం..! నాసా మరో ప్రయోగం..
ఈ ఏడాది ఏప్రిల్ లో చేపట్టిన ఆర్టిమిస్2 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు నాసా ఉత్సాహంగా సిద్ధమవుతోంది.
- Naveen
- Published on- May 28, 2026 / 07:13 PM IST
NASA Moon Base: శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న అమెరికా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చంద్రుడిపై పలు ప్రయోగాలు చేపట్టిన నాసా ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసం నిర్మించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ఓ రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేసినట్లు సమాచారం.
నాసా రూపొందిస్తున్న ఈ మెగా రోడ్ మ్యాప్ తో చంద్రునిపై మానవ కాలనీ కల అతి త్వరలోనే నిజం కానుంది. అర్టెమిస్ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యం నెరవేరనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మానవుల నివాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర స్థిరమైన మానవ కాలనీ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నాసా ప్రణాళికలు రచిస్తోంది. ఇది విజయవంతం అయితే అంగారక గ్రహం వైపు కూడా మానవులను పంపేందుకు పునాదులు పడనున్నాయి.
ఇక ఈ ప్రయోగం అంత తేలికేమీ కాదు. కఠినమైన రాళ్లు రప్పలు, దుమ్ముధూళి, తీవ్రమైన వేడి, చలితో కూడిన చంద్రుడి ఉపరితలంపై తిరగడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాల్సి ఉంటుంది. బరువైన యంత్రాలు, సామగ్రిని కూడా మోసుకెళ్లాలి. అందుకే ఈ సమస్య పరిష్కారంపై నాసా ఫోకస్ పెట్టింది. చంద్రుడిపై తిరిగేందుకు కార్లను రూపొందించనుంది.
ఏకంగా 22 కోట్ల డాలర్ల రూపాయల ఖర్చు..
మానవ సహిత రోవర్లను నిర్మించడానికి కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రోలాబ్ సంస్థను ఎంపిక చేసింది. అలాగే మరో కారును లునార్ అవుట్ పోస్ట్ అనే సంస్థ తయారు చేయనుంది. చందమామపై వ్యోమగాములు సులభంగా తిరగడానికి వీలుగా వాహనాలు తయారు చేసి ఇవ్వాలని సూచించింది. నాసా వ్యోమగాములు చంద్రుడిపై తిరిగేందుకు లూనార్ టెరైన్ వెహికల్ సర్వీసెస్ అనే రెండు వాహనాలు సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా చంద్రుడిపై సురక్షిత ప్రయాణం చేయోచ్చన్నమాట. ఇక ఇందుకోసం ఏకంగా 22 కోట్ల డాలర్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ రెండు కార్లు 2028 అంటే మరో రెండేళ్లలో చంద్రున్ని చేరుకోనున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ లో చేపట్టిన ఆర్టిమిస్2 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు నాసా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. చంద్రుడిపై శాశ్వత ఆవాస నిర్మాణం కోసం మూడు మిషన్లను ప్రకటించింది. మూడు మిషన్లలో భాగంగా చంద్రుడిపై ఆవాసం నిర్మాణానికి మొదట ఈ ఏడాది, వచ్చే ఏడాది కొన్ని ల్యాండర్ల ద్వారా సామాగ్రిని, పరికరాలను పంపిస్తారు. 2029 నుంచి 2032 వరకు రెండో దశలో విద్యుత్ గ్రిడ్ తో సహా శాశ్వత నివాసాన్ని చంద్రుడిపై నిర్మించడం ప్రారంభిస్తారు. 2032 నుంచి ప్రారంభమయ్యే మూడో దశలో అక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదే రోవర్లు, ల్యాండర్లను పరీక్షిస్తారు. ఇదే భవిష్యత్ ప్రయోగాలకు కీలకం కానుంది. ఇది విజయవంతం అయితే మానవులు చంద్రునిపై శాశ్వతంగా నివసించేందుకు మార్గం సుగుమం కానుంది. అదే జరిగితే మానవ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
Also Read: వావ్.. వాట్సాప్లో కొత్త ‘యూజర్ నేమ్’ ఫీచర్.. మీ ఫోన్ నెంబర్ ఇలా దాచేయండి!
