చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపుతున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2024లో చంద్రునిపైకి వ్యోమగాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను సోమవారం నాసా వెల్లడించింది. ఆర్టెమిస్ మిషన్ ద్వారా మానవులను చంద్రుడి మీదకు పంపనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్ స్టైన్ తెలిపారు.
చంద్రుడిపై దక్షిణ ద్రువం వైపు వెళ్లనున్నట్లు బ్రిడెన్ స్టైన్ తెలిపారు. మూన్ మిషన్ కోసం మూడు విభిన్న ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఇద్దరు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపుతామని, ఇద్దరు వ్యోమగాముల్లో ఒక మహిళ ఉన్నట్లు అయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం 28 బిలియన్ డాలర్లు ఖర్చుకానుందని జిమ్ బ్రిడెన్ స్టైన్ తెలిపారు. దీంట్లో 16 బిలియన్ల డాలర్లను కేవలం చంద్రుడిపై దిగే మాడ్యూల్ కు ఖర్చు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రాజెక్టుకు టాప్ ప్రియార్టీ ఇచ్చారు. కానీ దానికి కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) అనుమతి దక్కాల్సి ఉంది. నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశముంది.
మానవరహిత ఆర్టెమిస్ 1 వ్యోమనౌకను 2021లో ప్రయోగించనున్నారు. కొత్త తరహా ఎస్ఎల్ఎస్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తారు. దీని కోసం ఓరియన్ క్యాప్సూల్ వాడనున్నారు. 2023లో రెండవ ఆర్టెమిస్ రాకెట్ను ప్రయోగిస్తారు. ఆ వ్యోమనౌకలో వ్యోమగాములు ఉన్నా.. అది మాత్రం చుంద్రుడిపై దిగదు. ఇక చివరగా ఆర్టెమిస్-3ను ప్రయోగిస్తారు. ఇది 1969లో వెళ్లిన అపోలో 11 తరహా ఉంటుంది. వ్యోమగాములు ఆ నౌకలో వెళ్తారు. సుమారు వారం రోజుల పాటు ఆర్టెమిస్-3 చంద్రుడిపై ఉండే అవకాశాలు ఉన్నాయి.