Pakistan Coal Mine Clash
Pakistan: పాకిస్థాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో కొట్టుకోవడంతో 16మంది మరణించినట్లు తెలిసింది. పెషావర్ కు దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో కోహట్ జిల్లాలోని డేరా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది.
ఒకరిపై ఒకరు కాల్పులు ..
ఘర్షణ సమయంలో ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులు జరుపుకోవడం వల్ల 16మంది మరణించడం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఘటన స్థలికి చేరుకోవడంతో ఆందోళనకారులు కాల్పులు నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్రా ఆడమ్ ఖేల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘర్షణలో మరణించిన, గాయపడిన వారిని ఆస్పత్రికి తరిలించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారివారి కుటుంబాలకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు.
రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా వివాదం..
బొగ్గు గని డీ లిమిటేషన్ పై సానిఖేల్, జార్ఘున్ ఖేల్ తెగల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. వీరి మధ్య వివాదంను సర్దుమణిగించడానికి పలు ప్రయత్నాలు జరిగినా ప్రయోజనం కనిపించలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం ఆగ్రహంతో ఉంటారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల్లోని వారు ప్రాణాలు కోల్పోగా, గాయాలుసైతం అయ్యాయి. ఘటన తరువాత గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మొత్తం 16 మంది మరణించినట్లు పోలీసులు చెబుతున్నా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.