India discusses toextend food assistance to flood hit Pakistan
Pakistan floods : భారత్ విషయంలో పాకిస్థాన్ ఎన్నిసార్లు వక్రబుద్ధి చూపించినా భారత్ మాత్రం పెద్దమనస్సుతోనే వ్యవహరిస్తోంది. దీనికి ఉదాహరణగా వరదలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ కు ఆపన్నహస్తం అందించానికి భారత్ సంసిద్ధత వ్యక్తంచేస్తోంది. వరద బాధితులకు తినటానికి తిండి కూడాలేని దుస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ కు ఈ కనీవినీ ఎరుగని రీతిలో పులిమీద పుట్రలా వచ్చిపడ్డాయి. ఈ వరదలు ఎంతగా దేశాన్ని ముంచెత్తుతున్నాయంటే పాక్ లో సగం దేశం వరద ప్రభావానికి గురి అయ్యింది. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా ప్రాణాలుకోల్పోయారు. పాకిస్థాన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటువంటి దుస్థితిలో ఉన్న పాకిస్థాన్ కు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమవుతోంది. పాక్ కు ఆహార సాయం అందించడంపై కేంద్రంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. విపత్తులో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈక్రమంలో పాకిస్థాన్కు సాయం అందించడంపై చర్చలు జరుగుతున్నాయి. పాక్ లో 2005లో భారీ భూకంపం సంభవించినప్పుడు, 2010లో వరదలు వచ్చినప్పుడు భారత్ సహాయం అందించింది.
పాకిస్థాన్ లో భారీ వరదలకు బలైన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. పాక్ ప్రజలు ఈ కష్టకాలం నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్ ద్వారా ప్రకటించారు.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ భారత్ నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే అవకాశం ఉందంటూ పాక్ మంత్రి మిస్తా ఇస్మాయిల్ ఒకరు సూచన ప్రాయంగా చెప్పారు. ద్రవ్యోల్బణంతో కుదేలైన పాకిస్థాన్ ను వరదలు మరింత దుస్థితిలోకి నెట్టాయి. ప్రస్తుతం అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.