పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని భయానక చర్యగా
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని భయానక చర్యగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. ఇంత జరుగుతున్నా.. పాకిస్తాన్ ప్రధాని మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. కనీసం ఖండించిన పాపాన కూడా పోలేదు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందోనని, ఎక్కడ దాడి చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఓ పాకిస్తానీ మహిళ ధైర్యం చేశారు. పుల్వామా దాడిని ఖండించారు. భారత సీఆర్పీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఆమే పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ సెహీర్ మీర్జా. ”నేనో పాకిస్తాన్ అమ్మాయిని, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నా”.. అంటూ ప్లకార్డులు పట్టుకుని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతేకాదు.. భారత్కు మద్దతుగా ‘యాంటీ హేట్ చాలెంజ్’ ఉద్యమాన్ని చేపట్టారు. ‘దేశభక్తి కోసం మానవత్వాన్ని అమ్ముకోలేను’ అంటూ చాటి చెప్పి ఎల్లలు లేని మానవీయతను మీర్జా ప్రదర్శించారు.
తాను ధైర్యంగా స్పందించడమే కాదు తోటి మహిళలు కూడా భారత్లో చోటు చేసుకున్న అమానవీయ ఘటనపై తమ అభిప్రాయాలు తెలిపేలా మీర్జా ప్రోత్సహించారు. దాంతో యాంటీ హేట్ చాలెంజ్ హ్యాష్ ట్యాగ్తో పాటు ‘వీ స్టాండ్ విత్ ఇండియా’, నో టు వార్ హ్యాష్ ట్యాగ్లతో పాక్ మహిళలు పుల్వామా ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆమె స్ఫూర్తితో పాక్లో చాలామంది మన దేశానికి బాసటగా నిలుస్తున్నారు. భారత్-పాక్ మధ్య స్పర్థలు పోయి.. శాంతి నెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్ మీర్జా పోరాటం చేస్తున్నారు.