Pakistan Petrol Price : పాక్లో రాకెట్లా దూసుకెళ్తున్న రేట్లు.. లీటర్ డీజిల్ రూ.396.. లీటర్ పెట్రోల్..
Pakistan Petrol Price : పాకిస్థాన్ దేశంలో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.
- Harish Thanniru
- Published on- August 19, 2026 / 12:44 PM IST
petrol, High-Speed Diesel Prices raises in Pakistan
Pakistan Petrol Price : పాకిస్థాన్ దేశంలో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉధ్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా పాక్ సర్కార్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.3.34, హైస్పీడ్ డీజిల్ ధరను రూ.5.27 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read : Middle East Conflict : యుద్ధంలోకి మరో దేశం.. వరల్డ్ వార్ లోడింగ్?
ప్రభుత్వం పెంచిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో పాకిస్థాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.334.54కు చేరగా.. హైస్పీడ్ డీజిల్ ధర రూ.395.69కు చేరింది. అంతకుముందు పెట్రోల్ రూ.331.20గా, డీజిల్ రూ.390.42గా ఉంది. అంటే ఒక్క రోజులోనే వినియోగదారులపై ఇంధన భారం మరింత పెరిగింది.
పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల పెట్రోలియం ధరల సమీక్షను రోజువారీ ప్రాతిపదికన చేపట్టే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు, దిగుమతి వ్యయాలు, మారకపు విలువ తదితర అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దేశీయ వినియోగదారులపై ఆ ప్రభావం త్వరగా పడుతోంది. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోజువారీ ధరల నిర్ణయంలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు సంబంధించిన ఏడు రోజుల సగటును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రపంచ చమురు మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో దేశీయ ధరలను అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడమే ఈ విధానం లక్ష్యంగా ఉంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిస్థితుల కారణంగా చమురు రవాణా, సరఫరా మార్గాలు, షిప్పింగ్ ఖర్చులపై అనిశ్చితి పెరిగింది. పాకిస్థాన్ తన ఇంధన అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులు అక్కడి దేశీయ ఇంధన ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాకిస్థాన్లో రవాణా రంగంపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా డీజిల్ను విస్తృతంగా ఉపయోగించే బస్సులు, ట్రక్కులు, సరుకు రవాణా వాహనాల నిర్వహణ వ్యయం పెరగనున్న నేపథ్యంలో రవాణా ఛార్జీలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. పాకిస్థాన్లో పెట్రోల్పై ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు కూడా ఇంధన ధరలో పెరుగుదలతో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం పెట్రోల్పై లీటరుకు సుమారు రూ.114 పన్నులు, హైస్పీడ్ డీజిల్పై సుమారు రూ.100 పన్నులు, డ్యూటీలు ఉన్నాయి.
