Pm Modi: ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏయే అంశాలపై చర్చించారంటే

అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

  • Updated on- April 14, 2026 / 09:31 PM IST

Pm Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. 40 నిమిషాల పాటు వీరి మధ్య సంభాషణ సాగింది. పశ్చిమాసియాలో పరిస్థితులు, ఇరాన్ తో యుద్ధం, వాణిజ్యం, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. హర్మూజ్ భద్రతపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారని భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఈ ఏడాది ఇద్దరు నాయకుల మధ్య ఇది ​​మూడవ ఫోన్ సంభాషణ. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఘర్షణలు చెలరేగిన అనంతరం జరిగిన రెండవ సంభాషణ ఇది.

వాణిజ్య ఒప్పందంలో పురోగతిని ప్రకటించడానికి ఫిబ్రవరి 2న ఒకసారి, ఆ తర్వాత పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై చర్చించడానికి మార్చి 24న రెండోసారి వీరిద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకోవడం మూడోసారి.

గత వారాంతంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో యుద్ధం ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉంది. ఏప్రిల్ 22 వరకు సీజ్ ఫైర్ కుదిరింది.

ట్రంప్‌తో జరిపిన సంభాషణలో వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సాధించడంలో పురోగతిని సమీక్షించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. “అన్ని రంగాలలో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని ప్రధాని తెలిపారు.

ఇక పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై తాము చర్చించామని, అలాగే “హర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పామని” ప్రధాని మోదీ తెలిపారు. అంతకుముందు, సంఘర్షణ తర్వాత జరిగిన తొలి ఫోన్ కాల్‌లో, పశ్చిమ ఆసియాలో వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారు. అలాగే హర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉండేలా చూడటం గురించి కూడా మాట్లాడారు.

Also Read: హర్మూజ్ దిగ్బంధనం.. ఇండియాలో తగ్గిపోతున్న చమురు నిల్వలు.. ఇక సామాన్యులు బతకడం కష్టమే..!