భారత్‌ పంపిస్తే చచ్చిపోతా : యూకే కోర్టులో బోరుమన్న నీరవ్ మోడీ

  • Publish Date - November 7, 2019 / 07:03 AM IST

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి భారత్‌ను వదిలి లండన్‌కు వెళ్లిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెకదురైంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న నీరవ్‌మోడీకి లండన్‌ కోర్టు మరోసారి బెయిల్‌ను తిరస్కరించింది. ఇప్పటికి నాలుగు సార్లు నీరవ్ మోడీ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది కోర్టు. అయితే నేరస్తుల అప్పగింత కింద భారత్‌కు అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

పీఎన్‌బీ కేసుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 19న లండన్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నీరవ్ మోడీ బెయిల్ దరఖాస్తును యూకే కోర్టు ఇప్పటికే నాలుగు సార్లు తిరస్కరించింది. ఈ క్రమంలోనే భారత్ కు మోడీని అప్పగించాలంటూ వాదనలు భారత్ తరపున వాదనలు వినిపిస్తుంది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్).  ఇండియాకు అప్పగిస్తే తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా అని నీరవ్ మోడీ బెదిరిస్తున్నాడని వాదించారు. దీనిని బట్టి చూస్తేనే తప్పు చేసి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అర్థం అవుతుందని వాదించారు.

ఇదే క్రమంలో నీరవ్ మోడీ తరపు న్యాయవాది హ్యూగో కీత్, ఇద్దరు జైలు ఖైదీలు మోడీని బెదిరించారని, కొట్టారని కోర్టుకు వెల్లడించారు. 24 గంటల పర్యవేక్షణతో భద్రతను 2 మిలియన్ పౌండ్ల నుండి 4 మిలియన్ పౌండ్లకు పెంచాలని న్యాయవాది కోర్టుకు ప్రతిపాదించారు. మొత్తం వాదనలు విన్న కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించి వచ్చే ఏడాది మేలో తదుపరి విచారణ జరపనున్నట్లు చెప్పింది.