Pope Francis
Pope Francis: కేథలిక్ ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం గత నెలలో డిశ్చార్జి అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ లో పోప్ తన నివాసంలో మరణించారని వాటికన్ పేర్కొంది.
Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican’s Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2
— Vatican News (@VaticanNews) April 21, 2025
పోప్ ప్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో జన్మించారు. 2013 మార్చి 13న ఫ్రాన్సిస్ పోప్ గా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్ధుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.
ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదలైంది. పోప్ మృతిపట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోప్ మూడు పెద్ద చాకొలెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులకు బహుకరించారు.