Russia-Ukraine talks : రష్యా, యుక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్లో జరిగిన ఇరు దేశాల చర్చల్లో కీలక అడుగు పడింది. మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నట్లుగా న్యూట్రల్గా ఉంటామని యుక్రెయిన్ ప్రకటించింది. రెండ్రోజుల క్రితమే దీనిపై ప్రకటన చేసారు జెలెన్ స్కీ. తాజాగా చర్చల్లో యుక్రెయిన్ ప్రతినిధులు ఈ విషయాన్ని రష్యాకు స్పష్టం చేశారు. అలాగే రష్యా కోరుతున్నట్లుగా నాటోలో చేరబోమని కూడా హామీ ఇచ్చింది.
నాటో దళాలకు ఆతిథ్యం ఇవ్వబోమని యుక్రెయిన్ స్పష్టం చేసింది. యుక్రెయిన్ హామీతో రష్యా కాస్త వెనక్కు తగ్గింది. కీవ్, చెర్నివ్పై దాడుల తీవ్రతను తగ్గించింది. కీవ్ సరిహద్దుల నుంచి రష్యా సేనలు వెనక్కు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య చర్చలు కూడా సాధ్యమేనని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. ఇరు దేశాధినేతలు నేరుగా సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. దీంతో యుద్ధం ముగుస్తోందని భావిస్తున్నారు.
Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?
34రోజుల తర్వాత చర్చల్లో పురోగతి కనిపించడంతో యుక్రెనియన్లలో కొత్త ఆశలు రేగుతున్నాయి. ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి యుక్రెయిన్ నగరాలపై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. యుద్ధంలో వేల మంది చనిపోయారు. లక్షల మంది ఇతర దేశాలకు పారిపోయారు. రష్యా దెబ్బకు మరియుపోల్ నగరం శ్మశానంలా మారిపోయింది. రష్యాకు కూడా భారీ నష్టం జరిగింది. వేలమంది రష్యా సైనికులు చనిపోయారు. భారీ స్థాయిలో విమానాలు, ట్యాంకులను కోల్పోయింది. లక్షలకోట్ల నష్టం జరిగాక ఇరు దేశాల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.