Sanath Jayasuriya : శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగుదేశమైన లంకకు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఈ నేపథ్యంలో లంక మాజీ క్రికెటరలు సనత్ జయసూర్య, అర్జున రణతుంగ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తమ దేశం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లంకలో ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా మారాయి.
నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పటికే డీజిల్ చమురును పంపి లంకు సాయం అందించింది. ఇప్పుడు శ్రీలంకకు భారత్ ఒక బిలియన్ డాలర్ల తక్షణ సాయం అందించింది. దాంతో లంక క్రికెటర్లు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లంకకు కష్టమెచ్చినప్పుడల్లా భారత్ ఎప్పుడూ మాకు పెద్దన్నలా సాయం చేస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి మేమెంతో రుణపడి ఉంటాం. లంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశాన్ని ఆదుకుంటే బాగుంటుందని, అప్పుడే ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలమని భావిస్తున్నామని జయసూర్య అభ్యర్థించాడు.
మరో మాజీ క్రికెటర్, మంత్రి అర్జున రణతుంగ కూడా భారత్ సాయాన్ని ప్రశంసించారు. భారత్ సాయాన్ని ఎప్పుడూ మరిచిపోలేమని అన్నారు. లంక పరిస్థితులను తెలుసుకుని పొరుగుదేశమైన తమకు సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని రణతుంగ అన్నారు. పెట్రోల్, డీజిల్, మందులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను భారత్ పంపుతూ సాయాన్ని అందిస్తోందని ఆయన కొనియాడారు. లంక క్రికెటర్లలో కుమార సంగక్కర, మహేల జయవర్దెనె, భానుక రాజపక్స, లసిత్ మలింగ కూడా సోషల్ మీడియా వేదికగా తమ దేశ పరిస్థితులపై స్పందించారు.
లంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఫలితంగా అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. లంక ప్రజలు కనీసం కరెంట్, భోజనం, పెట్రోల్, డీజిల్ కనీస అవసరాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంక ప్రజలకు సాయం అందించి పొరుగు దేశాలు ఆదుకోవాలని లంక క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.
Read Also : Srilanka Emergency : శ్రీలంకలో ముదురుతోన్న సంక్షోభం.. అధ్యక్షుడి ఆఫర్ తిరస్కరించిన ప్రతిపక్షాలు..!