ship accident : ఒకే ఒక ఓడ.. ప్రపంచం మొత్తాన్ని కంగారు పెట్టిస్తోంది. ఒకే ఒక్క ఓడ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తల్లకిందులు చేసేలా ఉంది. అవును.. సముద్ర రవాణాలో అత్యంత కీలకమైన సూయజ్ కాలువలో జరిగిన ఓ ప్రమాదం.. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఆందోళన పెంచుతోంది. చూడటానికి చిన్నప్రమాదమే… కానీ దాని నష్టం మాత్రం భారీగానే ఉంది. ఎంత అంటే… భారత కరెన్సీలో ప్రతి గంటకు 2 వేల 600 కోట్ల రూపాయలు. అవును.. మీరు వింటున్నది నిజమే… గంటకు 2 వేల 600 కోట్ల రూపాయలు… అంటే రోజుకు 62 వేల 400 కోట్లు… ప్రమాదం జరిగి ఇప్పటికే 3 రోజులైంది. అంటే దీని వల్ల ఏకంగా లక్షా 87 వేల 200 కోట్లు నష్టం జరిగిపోయింది. పైగా భారత్ సహా ఎన్నో దేశాల క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనా ఈ ప్రమాదం భారీ ప్రభావం చూపించనుంది.
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన సూయజ్ కాలువలో మూడు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సూయజ్ కాలువలో మంగళవారం ఉదయం వచ్చిన ఎవర్ గ్రీన్ మెగా షిప్… ప్రమాదానికి గురైంది. కాలువ పక్కన ఉన్న మట్టికట్టను ఢీ కొట్టడంతో… తిన్నగా వెళ్తున్న షిప్.. ఒక్కసారిగా అడ్డం తిరిగింది. కాలువ రెండు గోడల మధ్య కాలువకు అడ్డుగా షిప్ నిలిచిపోయింది. సుమారు 400 మీటర్ల పొడవైన ఈ మెగా షిప్లో… దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల సరుకుంది. ఈ షిప్ను బయటకు తీసుకువస్తే తప్ప.. మరో షిప్ ఆ మార్గంలో వెళ్లేందుకు ఛాన్స్ ఉండదు.. దీంతో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన జలమార్గంలో సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కాలువలో చిక్కుకున్న భారీ కంటైనర్ షిప్ను తొలగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంతవరకూ వర్కవుట్ కాలేదు.
ఈ సూయజ్ కాలువ నుంచి చమురును పెద్ద ఎత్తున రవాణా చేస్తారు. అలాగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం లావాదేవీలు ఈ కాలువ మీదుగానే జరుగుతాయి. ఎవర్ గ్రీన్ షిప్ ప్రమాదం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. సూయజ్ ్కాలువకు ఇరువైపులా.. భారీగా ఓడలు నిలిచిపోయాయి. ఇప్పటికే మూడు రోజులుగా ఎవర్ గ్రీన్ షిప్ తొలగించేందుకు అధికారులు విఫలయత్నం చేస్తున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో నౌకను డ్రెడ్జింగ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇప్పటికే సుమారు 165 ఓడలు ఎదురుచూస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సూయజ్ కెనాల్ వెస్ట్ బౌండ్ ట్రాఫిక్ బిజినెస్ రోజుకు 5.1 బిలియన్ డాలర్లు…. ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్ బిజినెస్ రోజుకు 4.5 బిలియన్ డాలర్లు. ఈ ఓడ ప్రమాదంతో.. ఇదంతా ఎఫెక్ట్ అయ్యింది.
ఈ జలమార్గం ఇరుకైంది కావడంతో.. ఇరుక్కుపోయిన ఓడను తొలగించడం చాలా కష్టంగా మారింది. దాదాపు 120 మైళ్ల పొడవైన ఈ కాలువ ఒడ్డున భారీగా ఇసుక చేరింది. ఉత్తర మధ్యధరా, దక్షిణ ఎర్ర సముద్రంతో ఈ కాలువ లింక్గా ఉంది. ఈ మార్గంలో కొన్ని చోట్ల 675 అడుగుల వెడల్పు కంటే తక్కువ కూడా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎవర్ గ్రీన్ షిప్ ప్రమాదం భారత్ పై కూడా చూపనుంది. ఓపెక్ దేశాల నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించి.. ఆఫ్రికా, సౌత్ అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచిన భారత్.. ఇప్పుడు సూయజ్ కాలువ ద్వారా దిగుమతి చేసుకొంటోంది.
ఎవర్ గ్రీన్ ప్రమాదంతో… 13 మిలియన్ బారెల్స్ ముడి చమురును మన దేశానికి మోసుకొస్తున్న 10 ముడి ఓడల ప్రయాణం అర్థాంతరంగా నిలిచిపోయింది. దీని కారణంగా భారత్కు క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం భారత్లో ఆయిల్ ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. ఈ ప్రమాదంతో మరింత పెరగొచ్చన్న భయం వెంటాడుతోంది. సూయజ్ కాలువ రాకపోకలు నిలిచిపోవడం ద్వారా బ్యారెల్ ధర మరో 5 శాతం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సూయజ్ కాలువలో రాకపోకలు నిలిచిపోవడంతో.. అటు పనామా కెనాల్తో పాటు దక్షిణాసియాలోని మలాకా స్ట్రెయిల్ కెనాల్లో వాణిజ్య లావాదేవీలకు అంతరాయం కలిగింది.