Iraq Crisis
Iraq Crisis : గత కొన్నేళ్ళుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇరాక్లో కూడా అనుకోకుండా ఉపద్రవం వచ్చిపడింది. ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఇరాక్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు బాగ్దాద్లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు. షియా మతగురువు ముక్తదా అల్ సదర్కు మద్దతుగా వందలాది అనుచరులు రోడ్డెక్కారు. దీనితో ఆగకుండా ఏకంగా బారికేడ్లు తొలగించి, గోడలు ఎక్కి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి తమ నిరసనను తెలిపారు. పోలీసులు ఆందోళన కారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారుప. గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వారు లెక్క చేయకుండా పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు.
గత నాలుగు రోజుల్లో ఇరాక్లో పార్లమెంట్ భవనంను దిగ్భందించడం ఇది రెండోసారి. బాగ్దాద్ లోని పార్లమెంటు భవనంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో పార్లమెంట్ భవనం మొత్తం ఆందోళనకారులతో నిండిపోయింది. ఇరాన్కు వ్యతిరేక నినాదాలతో పార్లమెంట్ మారుమ్రోగింది. ఇరాక్ జెండాలను పట్టుకుని ఆందోళనకారులు టేబుళ్లపైకి ఎక్కారు. నిరసన సమయంలో అక్కడ పార్లమెంట్ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అక్కడ భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారే ఆందోళనకారులను లోపలకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్ వినియోగించారు. అయినా.. గేట్లు బద్దలుగొట్టి వారు పార్లమెంటులోకి దూసుకొచ్చారు. గతేడాది అక్టోబరులో జరిగిన ఇరాక్ ఎన్నికల తర్వాత ఇదే అతి పెద్ద ఆందోళన. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరాక్లో గత ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ అవతరించి ముక్తదా అల్ సదర్ పార్టీ. అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ… ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముక్తదా నిర్ణయించారు. ప్రధాని ముక్తదా అల్ సదర్ కాకుండా విపక్షాలు ప్రధాని అభ్యర్థిగా మహమ్మద్ అల్ సుదానీని ప్రకటించాయి. దీన్ని ఇరాక్ మద్దతు దారులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం పార్లమెంట్ భవనం వద్ద వేలాది మంది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తాజాగా శనివారం మరోసారి పార్లమెంట్ భవనంకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని ముట్టడించారు.
ఇరాన్ అనుకూల పార్టీలు తమ దేశప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడి జనం. దీంతో ప్రస్తుతం ఇరాక్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. నిరసనకారుల్లో చాలా మంది మత పెద్ద ముఖ్తాదా ఆల్ సదర్ అనుచరులే ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా.. పదవి మాత్రం దక్కలేదని ఆగ్రహం వారిలో ఉంది. మరోవైపు పార్లమెంట్లో ముట్టడించిన దృశ్యాలు కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆటపాటలతో నిరసనకారులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా ఇరాక్ పార్లమెంట్ స్పీకర్ డెస్క్పై పడుకున్నారు. ప్రజలందరూ మీ వెంట ఉన్నారు సయ్యద్ ముక్తాదా అని నిరసనకారులు నినాదాలు చేశారు. ఆయనే మహమ్మద్ ప్రవక్త వారసుడు అని కూడా నినాదాలు చేశారు.
ప్రస్తుతం చమురు ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో ఒకటి ఇరాక్. రష్యా-ఉక్రెయిన్ వార్తో రికార్డు స్థాయికి చేరిన క్రూడాయిల్ ధర ఇటీవలి కాలంలో భారీగా తగ్గింది. రాజకీయ, సామాజిక-ఆర్థిక సంక్షోభంలో ఇరాక్ చిక్కుకోవడంతో ఆ ప్రభావం ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.