Haibatullah Akhundzada : పాక్ ఆర్మీ కస్టడీలో తాలిబన్ చీఫ్!
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
- venkaiahnaidu
- Published On : August 20, 2021 / 08:53 PM IST
Haibatullah
Haibatullah Akhundzada అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. గత కొన్ని నెలల నుంచే హైబతుల్లా అఖుంద్జాదా బయటి ప్రపంచానికి కనబడుటలుదు. 20ఏళ్ల తర్వాత మళ్లీ అప్ఘానిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కూడా ఆయన జాడ కనిపించడం లేదు. దీంతో హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆశక్తి నెలకొంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో హైబతుల్లా ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు.
హైబతుల్లా ఆచూకీపై భారత ప్రభుత్వం ఆరా తీస్తోంది. విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పంచుకున్న సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. రహస్యంగా ఉన్న అఖుంద్జాదాను గుర్తించేందుకు చర్యలు చేపడుతోంది. హైబతుల్లా అఖుంద్జాదా..పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉండవచ్చునని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి శుక్రవారం తెలిపారు. ఆరు నెలలుగా అతడు ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. తాలిబన్ సీనియర్ నాయకులు కూడా ఆయనని చూడలేదన్నారు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్ సందర్భంగా వచ్చిందన్నారు. కాగా,హైబతుల్లా అఖుంద్జాదా..పాకిస్తాన్ చెరలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.
వాస్తవానికి తాలిబన్ సుప్రీం లీడర్లుగా వ్యవహరించే వారు బాహ్య ప్రపంచానికి కనిపించడం అరుదే. ఇంతకు ముందు ఉన్న వారు కూడా ఇలాగే రహస్య ప్రదేశాల్లోనే ఉండేవారు. సాధారణ కార్యకలాపాలను వారి అనుచరులకు అప్పజెప్పి కీలక వ్యూహాలు,వ్యవహారాలను మాత్రమే వాళ్లు పర్యవేక్షిస్తుంటారు. తాలిబన్ల వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా ఒమర్ 2013లో మరణించగా, అనంతరం తాలిబన్లకు చీఫ్ గా వ్యవహరించిన అఖ్తర్ మన్సూర్ 2016లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో చనిపోయారు. 2016 మే నెలలో తాలిబన్ ల సుప్రీం లీడర్ గా హైబతుల్లా అఖుంద్ జాదా నియమితుడయ్యాడు. తాలిబన్లకు నేతృత్వం వహించిన మూడో నాయకుడు ఇతడే.
60 ఏళ్ల వయసున్న హైబతుల్లా అఖుంద్జాదా తాలిబన్ల బృందంలో కేవలం సైనికుడిగానే కాకుండా రాజకీయ, మిలిటరీ న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. తాలిబన్లకు నాయకత్వం వహిస్తోన్న ఐదారుగురు కీలక నేతల్లో హైబతుల్లా అఖుండ్ జాదా ముందున్నారు. అయితే తాజాగా అఫ్గాన్ తాలిబన్ల నియంత్రణంలోకి వచ్చిన తరువాత హైబతుల్లానే పాలనా పగ్గాలు చేపడతారనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది.
READ Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!
