world smallest kingdom : 11మంది జనాభా ఉండే అరుదైన రాజ్యం..చెడ్డీతో తిరిగే చక్రవర్తి..బంగారు పళ్లుండే మేకలు

ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం ట‌వోలారా. 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బుల్లి రాజ్యంలో 11మంది జనాభా. ఈ రాజ్యంలో వింతలు విశేషాలకు కొదువేలేదు,.రాజ్యం ఏర్పాటు వెనక కథ వెరీ ఇంట్రెస్టింగ్..

Tavolara..world Smallest Kingdom

Tavolara..world smallest kingdom : రాజ్యాలను పాలించే రాజులు ఎంతో దర్పంగా..భోగాలను అనుభవిస్తు ఉంటారని విన్నాం. ఇప్పటికీ చాలా దేశాల్లో ఉండే రాచరికపు రాజులు అలాగే ఉంటారు. సాధారణంగా రాజ్యం మంత్రులు,వేలాది సైన్యం, అడుగులకు మడుగులు ఒత్తే నౌకర్లు, చాకర్లు,వేలాది పనివాళ్లు, లక్షలాది జనాభా ఉంటారు. ఓ వింత సామ్రాజ్యంలో అవేవీ ఉండవు. ఆ రాజ్యానికి రాజుకు కిరీటాలు ఉండవు.పట్టుబట్టలు వేసుకోడు. కోటా లేదు.నౌకర్లు చాకర్లు ఎవ్వరూ లేరు. పైగా ఆ రాజుకు సాధారణ మనిషిలాగా జీవిస్తుంటాడు. ఓ చిన్న నిక్కరు వేసుకుంటాడు చిన్నపిలగాడిలాగా. ఈ విచిత్ర సామ్రాజ్యంలో ఇంకో వింత ఏటంటే ఈ రాజ్యం మొత్తం జనాభా కేవలం 11 మంది. ఈ రాజ్యపు రాజు నిక్క‌ర్ వేసుకుని ప‌డ‌వ నడుపుతూ బ‌తికేస్తుంటాడు. ఈ రాజ్యం గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా విశేషాలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం అయిన ఈ రాజ్యం గురించి చాలా ఆస‌క్తిక‌ర‌మైన చ‌రిత్ర ఉంది. మ‌రి ఆ విశేషాలేంటో..

ఇట‌లీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు స‌మీపంలో మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఓ దీవి ఉంది. రాజ్యం ఏర్ప‌డి 180 సంవ‌త్స‌రాలు అవుతుంది. దాని పేరే ట‌వోలారా. ఈ దీవి 5 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం. ఈ సామ్రాజ్యంలో కేవ‌లం 11 మంది జనాభా. ఈ రాజ్యానికి ఒక చ‌క్ర‌వ‌ర్తి. ఆయ‌న పేరు ఆంటోనియో బ‌ర్ద‌లివోని. ఈరాజుకి తలపై కిరీటాలు ఉండవు..ఒంటిపై పట్టు బట్టలు ఉండవు. నిక్క‌ర్ వేసుకుని తిరుగుతుంటాడు.

ఈ రాజ్యంలో రాజుకు భోజ‌నం మాత్ర‌మే ఉచితంగా ల‌భిస్తుంది. మిగ‌తా అవ‌స‌రాల కోసం ఆయన కష్టపడి బతకాల్సిందే.అందుకే రాజు ఆంటోనియో బ‌ర్ద‌లివోని ప‌డ‌వ న‌డుపుతూ జీవిస్తుంటాడు.మరి ఈరాజుకు ఆస్తులేమీ లేవా? అంటే ఉన్నాయి. ఓ రెస్టారెంట్ ఉంది. ట‌వోలారా సామ్రాజ్యం ఇటీవ‌లే 180వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని కూడా ఉన్న జనాభాతో ఘనంగా జ‌రుపుకుంది.

ట‌వోలారా రాజ్యం ఏర్ప‌ాటు క‌థ
ట‌వోలారా రాజ్యం ఏర్ప‌ాటు ఇట‌లీ దేశంగా అవ‌త‌రించ‌క‌ముందు సార్డీనియా రాజ్యంలో ఉండేది. ఆ దేశపు రాజు చార్లో ఆల్బెర్టో. అక్కడ ఎవ్వరైనా సరే ఒకే పెళ్లి చేసుకోవాలి. రెండు పెండ్లిళ్లు చేసుకోవ‌డం నేరం అని ప్రకటించాడు. దాన్ని అతిక్రమిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించాడు. కానీ ట‌వోలారా ప్ర‌స్తుత రాజు ఆంటోనియా ముత్తాతకు ముత్తాత గుసెప్పే రెండు పెండ్లిళ్లు చేసుకున్నాడు. దీంతో అతను శిక్ష త‌ప్పించుకోవటానికి త‌న కుటుంబంతో కలిసి 1807లో సార్డీనియా నుంచి పారిపోయి ఈ టవోలారా దీవికి వచ్చేశాడు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి టవోలారా దీవి గురించి సార్డీనియా రాజు చార్లో ఆల్బెర్టోకు తెలిసింది. కానీ ఆ దీవిలో గుసెప్పే ఉన్నాడని తెలియదు. కానీ దీవి గురించి రాజు చార్లో ఆల్బెర్టో ఓ వింత విషయం విన్నాడు.

ట‌వోలారా దీవిలో బంగారు రంగు పళ్లు ఉండే మేక‌లు..
ట‌వోలారా దీవిలో బంగారు రంగు పళ్లు ఉండే మేక‌లు ఉంటాయ‌ని.. ప్ర‌పంచంలో ఇటువంటి మేక‌లు ఇంక ఎక్కడా లేవని అవి ఇక్క‌డ మాత్ర‌మే ఉంటాయ‌ని ప్ర‌జ‌లు చెప్పుకునేవాళ్లు. దీంతో ఈ వింత మేక‌ల‌ను చూడటానికి సార్డీనియా రాజు 1836లో ఈ దీవికి వ‌చ్చాడు. అక్క‌డికి రాగానే ఆల్బెర్టోకు గుసెప్పే కుమారుడు ప‌వోలో క‌నిపించాడు. తాను సార్డీనియా రాజున‌ని ఆల్బెర్టో ప‌రిచ‌యం చేసుకున్నాడు. కానీ ఆల్బెర్టోకు అతను గుసెప్పే కొడుకని తెలియదు. దీంతో ప‌వోలో ఏం చెప్పాలో అర్థం కాక మేకపోతు గాంభీర్యంతో ‘నేను టవోలారా రాజ్యానికి రాజుని’ అని చెప్పాడు.

ఆ ప‌రిచ‌యం త‌ర్వాత ఆల్బెర్టో మూడు రోజులు అక్కడే ఉండి బంగారు రంగులో ప‌ళ్లున్న మేక‌ల‌ గురించి అడిగాడు. దానికి పవోలో తన గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడుతు ఆ బంగారు రంగు పళ్లున్న మేకలను చూపించగా ఆల్బెర్టో వాటిని వేటాడాడు. దానికి ప‌వోలో సాయం చేశాడు. మూడు రోజుల‌ త‌ర్వాత ఆల్బెర్టో ట‌వోలారా దీవి నుంచి సార్డీనియాకు వెళ్లిపోయాడు. ఆతరువాత టవోలారా తమ రాజ్యంలో భాగం కాదని ప్ర‌క‌టించాడు. ఇక అప్పుడు ప‌వోలో ఇక ఈ ట‌వోలారా దీవి నా సామ్రాజ్యం అని నిర్ణయించేసుకుని దాన్ని తన సామ్రాజ్యంగంగా ప్ర‌క‌టించుకున్నాడు. అప్ప‌ట్లో ఆ రాజ్యంలో 33 మంది ఉండేవారు.


నాటో రాక‌తో అధికారం పోయింది
సార్డీనియా రాజు ప‌ర్య‌ట‌న‌తో ట‌వోలారా సామ్రాజ్యం గురించి మ‌ధ్య‌ధరా స‌ముద్రంలో చాలా దేశాల‌కు తెలిసిపోయింది. 19వ శ‌తాబ్దంలో ప్ర‌పంచ దేశాల చ‌క్ర‌వ‌ర్తుల ఫొటోల‌ను సేక‌రించాల‌ని క్వీన్ విక్టోరియా ఆదేశించారు. ఆ స‌మ‌యంలో ట‌వోలారా రాజ కుటుంబం ఫొటోల‌ను కూడా బ్రిట‌న్ తీసుకెళ్లారు. ఆ ఫొటోలు ఇప్ప‌టికీ బ‌కింగ్‌హామ్ ప్యాలెస్‌లో క‌నిపిస్తాయి. అయితే 1962లో నాటో ట‌వోలారాను స్థావ‌రంగా మార్చుకోవ‌డంతో.. ప‌వోలో వార‌సులు ఈ రాజ్యంపై అధికారాల‌ను కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆ కుటుంబం వారిని రాజుగానే గుర్తిస్తారు. ఇక్క‌డ విశేషమేంటంటే.. ట‌వోలారాను త‌మ దేశంలో భాగ‌మ‌ని ఇటలీ ఎప్పుడూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అలాగే టవోలారాను ప్ర‌త్యేక దేశంగా ఎవ‌రూ గుర్తించ‌లేదు. అలా ప్రస్తుతం ఈ సామాజ్యం 11మంది జనాభాతో కొనసాగుతోంది.

రాజుగారి జీవ‌నాధారం..ప‌డ‌వ న‌డప‌డ‌ం
ట‌వోలారా రాజ్యానికి చుట్టుప‌క్క‌ల చాలా ర‌కాల స‌ముద్ర జీవులు ఉంటాయి. అరుదైన మేక‌లు, గ‌ద్ద‌లు వంటి పక్షులుంటాయి. వీటిని చూసేందుకు పలు దేశాల నుంచి పర్యాటకు భారీగా తరలివస్తుంటారు టవోలారా దీవికి. పర్యాటకుల కోసం రాజు అత‌ని మేన‌ల్లుడు ప‌డ‌వ నడుపుతుంటారు. మ‌రో మేన‌ల్లుడు రెస్టారెంట్ న‌డుపుతుంటాడు. అక్క‌డే చేప‌లు ప‌ట్టి ప‌ర్యాట‌కుల‌కు వండి పెడుతుంటారు.

ప్ర‌స్తుతం ఇదే ఈ రాజుగారి జీవ‌నాధారం. ఈ రాజుగారికి ఒక వింత అలవాటుంది. పొద్దున్నే లేవ‌గానే శ్మ‌శాన వాటిక‌కు వెళ్తాడు. ఆ శ్మశానం రాజు కుటుంబానికి చెందినదే. అక్క‌డ త‌న భార్య స‌మాధిపై నిజమైన పువ్వులు కాకుండా ప్లాస్టిక్ పూలు పెట్టి నివాళుల‌ర్పిస్తాడు. ఆ తరువాతే ఏపనిచేసినా. స‌మాధిపై ప్లాస్టిక్ పూలే పెట్ట‌డం వెనుక కూడా ఒక కార‌ణం ఉంది. స‌మాధిపై పెట్టిన పూల‌ను ఇక్క‌డి అరుదైన మేక‌లు తినేస్తున్నాయంట‌. అందుకే మేక‌లు తిన‌కుండా ఉండటానికి రాజుగారు ప్లాస్టిక్ పూల‌ను పెడుతుంటారట. ఏది ఏమైనా ఒకరు చేసిన తప్పు ఓ రాజ్యం ఏర్పడానికి కారణమైంది. తద్వారా ఆ అరుదైన దీవి గురించి ఈ ప్రపంచానికి తెలిసింది.