Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 50వేల వరకు చేరుకోవచ్చని యూఎన్ అంచనా
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల 5,279 మంది ప్రాణాలు కోల్పోగా, 5వేల మంది గాయపడినట్లు అధికారులు గుర్తించారు.
- Harishth Thanniru
- Published On : February 12, 2023 / 08:30 AM IST
Turkiye, Syria Earthquake
Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భూకంప ప్రభావంతో నేలకూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతుండగా, అధికశాతం మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారు. ఆ ప్రాంతంలో భూకంపం సంభవించి వారం అవుతోంది. ఇంకా.. భారీగా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొత్త లెక్కల ప్రకారం.. 29,896 మంది మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఊహించని విపత్తు కారణంగా 85వేల మందికిపైగా గాయపడ్డారు. వీరంతా ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల 5,279 మంది ప్రాణాలు కోల్పోగా, 5వేల మంది గాయపడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య 50వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.
Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్
ప్రకృతి విపత్తులో చిక్కుకున్న టర్కీకి ప్రపంచ బ్యాంకు 1.78 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాసైతం టర్కీ, సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు 85 మిలియన్ల డాలర్లు సాయాన్ని ప్రకటించింది. ఇదిలాఉంటే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత ఆర్మీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వేలాది మందికి ఇండియన్ ఆర్మీ వైద్య సేవలు అందిస్తోంది. మిలిటరీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ్ మాట్లాడుతూ.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాల భవనాల్లో ఆస్పత్రిని ఏర్పాటు చేసి, ఇందులోనే ల్యాబ్, ఎక్స్ రే సౌకర్యాలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు, వైద్య సేవలు అందించడం ఇలా అన్ని విధాల ఇండియన్ ఆర్మీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తోంది.
