High BP
High BP : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రజల లైఫ్స్టైల్ చాలా వరకు మారిపోయింది. ఉద్యోగం, వ్యాపారాల కారణంగా ఒత్తిడి చాలామందికి కామన్ అయింది. ఇక ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం డెస్క్జాబ్స్ అధికంగా ఉండటంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇవన్నీ కలిసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో చాలా మంది హైబీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు.
రక్తపోటు (బీపీ) నియంత్రణకు అనేక మందులు వాడుతుంటారు. వైద్యుల సూచన మేరకు ప్రతీరోజూ ఈ మందులను వాడుతుంటారు. అలాంటి వారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు. ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ఓ వ్యాసం ప్రచురించింది.
అమెరికాకు చెందిన రోష్ అండ్ అల్నైలమ్ ఫార్మా స్యూటికల్స్.. ఆర్ఎన్ఏ టెక్నాలజీతో జిలెబెసి రన్ అనే ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైన కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రోటీన్కు అడ్డుకట్ట వేస్తుంది. ఇక ఇంజెక్షన్ చేస్తే ఆరు నెలల పాటు సమర్థంగా పనిచేసినట్లు పరిశోధనల్లో గుర్తించారు.
ఇది సురక్షితమేనా..
ప్రారంభ పరీక్షలు అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి. కానీ, పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ పరిశోధనలు క్లినికల్ పరీక్షలో ఉన్నాయని, ప్రామాణిక చికిత్సను భర్తీ చేయడానికి ఇంకా సిద్ధంగా లేవని తెలిపారు. ఈ ఇంజెక్షన్లు అందుబాటులో రావాలంటే సమయం పడుతుందని, పలు అధ్యయనాల తరువాత పూర్తి భద్రతతో కూడిన ఫలితాలు ఇస్తాయని భావించిన తరువాత ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 2024–2025 నాటికి 30 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వారు 1.4 బిలియన్ల మంది.. పెద్ద వయస్సులో ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో జీవిస్తున్నారు. వారిలో దాదాపు 44 శాతం మందికి తమకు ఈ వ్యాధి ఉందని కూడా తెలియదు. 31.5 కోట్ల మంది భారతీయులకు అధిక రక్తపోటు ఉందని అంచనా వేయబడింది. చాలా మందికి అది నియంత్రణలో లేదు.