Russia Armed Forces Killed : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులకు పైగా రష్యా సేనలు యుక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.
తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 17,200 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ సైన్యం మంగళవారం ప్రకటించింది. దీంతోపాటు 597 ట్యాంకులు, 1710 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 127 యుద్ధ విమానాలు, 129 హెలికాప్టర్లు, 71 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.(Russia Armed Forces Killed)
నెలరోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి.
యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలకు పైగా భీకర యద్ధం కొనసాగుతోంది. అయితే, పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.
సైనిక చర్య పేరుతో యుక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన రష్యా.. మరిన్ని ప్రాంతాల్లో భీకర దాడులతో తెగబడుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని మరోసారి తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.
మరోవైపు యుద్ధం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్లో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చల్లో కీలక అడుగు పడింది. మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నట్లుగా న్యూట్రల్గా ఉంటామని యుక్రెయిన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే దీనిపై ప్రకటన చేశారు జెలెన్ స్కీ. తాజాగా చర్చల్లో యుక్రెయిన్ ప్రతినిధులు ఈ విషయాన్ని రష్యాకు స్పష్టం చేశారు. అలాగే రష్యా కోరుతున్నట్లుగా నాటోలో చేరబోమని కూడా హామీ ఇచ్చింది.
యుక్రెయిన్ హామీతో రష్యా కాస్త వెనక్కు తగ్గింది. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో యుద్ధ కార్యకలాపాలను భారీగా తగ్గించాలని రష్యా రక్షణ శాఖ నిర్ణయించింది. కీవ్ సరిహద్దుల నుంచి రష్యా సేనలు వెనక్కు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య చర్చలు కూడా సాధ్యమేనని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. ఇరు దేశాధినేతలు నేరుగా సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. దీంతో యుద్ధం ముగుస్తుందని అంతా భావిస్తున్నారు.