Russia President Vladimir Putin
ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి నెలకొనాలంటే ఆ దేశం తటస్థంగా ఉండాలని చెప్పారు. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనిపై తాజాగా పుతిన్ స్పందిస్తూ… ఏళ్ల తరబడి తాము తమ సరిహద్దులకు సంబంధించిన పాలసీని (రివిజనిజాన్ని) కొనసాగిస్తున్నామని చెప్పారు. 1992లో కొన్ని షరతులపై ఉక్రెయిన్ సరిహద్దులను రష్యా గుర్తించిందని తెలిపారు.
అనంతరం ఉక్రెయిన్ ఆ షరతులను ఉల్లంఘించిందని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ తటస్థ విధానాన్ని పాటించకపోతే తమ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను ఊహించడం కష్టమని తెలిపారు. సరిహద్దులను గుర్తించడంలో ఉక్రెయిన్ తటస్థంగా లేదని అన్నారు. రష్యన్ ఫెడరేషన్ ప్రయోజనాలకు హాని కలిగించే సాధనంలా కొందరి చేతుల్లో పావులా ఉక్రెయిన్ మారిందని పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, నాటోలోనూ లేనప్పటికీ, చివరకు వాటిల్లో చేరే అవకాశాలూ ఉన్నాయని పుతిన్ చెప్పారు. తమ కూటముల్లో ఉక్రెయిన్ చేరుతుందని ఈయూ, నాటో రెండూ చెప్పాయని గుర్తుచేశారు. శాంతి నెలకొనాలంటే ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న కోరికను వదులుకోవడమే కాకుండా, రష్యా క్లెయిమ్ చేస్తున్న ఉక్రేనియన్ భూభాగాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు.