Pig Kidney into Human : వైద్య చరిత్రలో మరో అద్భుతం.. మసాచుసెట్స్లోని వేమౌత్కు చెందిన రిచర్డ్ స్లేమాన్ అనే 62ఏళ్ల వ్యక్తికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు అమెరికాకు చెందిన వైద్యులు. తద్వారా ప్రపంచంలోనే పంది కిడ్నీని స్వీకరించిన మొదటి వ్యక్తిగా రిచర్డ్ నిలిచాడు. స్లేమాన్ డయాలసిస్పై ఏడేళ్ల తర్వాత 2018లో అదే ఆసుపత్రిలో మానవ మూత్రపిండ మార్పిడిని చేయించుకున్నాడు. అయితే, ఐదేళ్ల తర్వాత ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అప్పటినుంచి డయాలసిస్ పైనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చివరి స్టేజీ మూత్రపిండాల వ్యాధితో అతడు బాధపడుతున్నాడు.
కోలుకుంటున్న రిచర్డ్.. త్వరలోనే డిశ్చార్జ్ :
అయితే, మార్చి 16న దాదాపు 4 గంటల శస్త్రచికిత్స నిర్వహించి అతడికి విజయవంతంగా పంది కిడ్నీని అమర్చినట్టు బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి రిచర్డ్ బాగానే కోలుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు పేర్కొన్నారు. బతికి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం వైద్యచరిత్రలో ఇదే మొదటిసారిగా వైద్యులు తెలిపారు. జంతువుల నుంచి మానువులకు కిడ్నీ మార్పిడి ప్రక్రియ దీర్ఘకాలిక ఫలితాలపై నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారని లాస్ ఏంజిల్స్లోని యూఎస్సీ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ కిడ్నీ, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్ జిమ్ కిమ్ అన్నారు.
గతంలో కోతుల్లో పంది కిడ్నీల మార్పిడి :
మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లోని ఈజెనెసిస్ ద్వారా ఈ కిడ్నీని అందించారు. అయితే, జన్యుపరంగా సవరించిన ఒక పంది నుంచి ఈ కిడ్నీని సేకరించారు. కొన్ని జన్యుపరంగా మానవులకు వ్యాధులు సోకే అవకాశం ఉన్న పందులకు అంతర్లీనంగా ఉండే వైరస్లను కూడా తొలగించారు. ఇదేవిధంగా, ఎజెనెసిస్ ద్వారా జన్యుపరంగా సవరించిన పందుల నుంచి మూత్రపిండాలు విజయవంతంగా కోతులలోకి మార్పిడి చేశారు. అయితే, ఆ కోతులు సగటున 176 రోజులు సజీవంగా ఉన్నాయని పరిశోధకులు అక్టోబర్లో నేచర్ జర్నల్లో నివేదించారు.
జాతి నుంచి మరో జాతికి అవయవ మార్పిడి సాధ్యమే :
బాధిత వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ పంది అవయవాన్ని తిప్పికొట్టకుండా నిరోధించేలా డ్రగ్స్లో ఎలెడాన్ ఫార్మాస్యూటికల్స్ టెగోప్రుబార్ట్ అనే ప్రయోగాత్మక యాంటీబాడీ ఉంటుంది. ఈ సర్జరీ జెనోట్రాన్స్ప్లాంటేషన్లో పురోగతిని సూచిస్తుంది. అవయవాలు లేదా కణజాలాలను ఒక జాతి నుంచి మరొక జాతికి మార్పిడి చేయొచ్చునని నిరూపితమైందని ఎన్వైయూ లాంగోన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరీ చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న అనేక వందల వేల మందికి అవయవాలకు ప్రత్యామ్నాయంగా మారిందని ఆయన తెలిపారు.
అమెరికాలో కిడ్నీల మార్పిడికి ఫుల్ డిమాండ్ :
యునైటెడ్ నెట్వర్క్ ఫర్ ఆర్గాన్ ప్రకారం.. అమెరికాలో లక్ష కన్నా ఎక్కువ మంది ప్రజలు అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. మూత్రపిండాలకు అత్యధిక డిమాండ్ ఉంది. గతంలో న్యూయార్క్ యూనివర్శిటీ సర్జన్లు బ్రెయిన్ డెడ్ వ్యక్తులకు మాత్రమే పంది మూత్రపిండాలను మార్పిడి చేశారు. మార్పిడి కేంద్రాలు జన్యు సవరణలు, మందుల పరంగా విభిన్న విధానాలను తీసుకుంటున్నాయని మోంట్గోమెరీ చెప్పారు. వెయిటింగ్ లిస్ట్లలో రోగులకు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవచ్చునని అన్నారు. జనవరి 2022లో యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ బృందం టెర్మినల్ హార్ట్ డిసీజ్తో బాధపడే 57 ఏళ్ల వ్యక్తికి జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను మార్పిడి చేసింది. కానీ, అతడు రెండు నెలల తర్వాత మరణించాడు.
Read Also : Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్తో 45కిలోలు తగ్గిన నర్సు..!