Covid
Corona World: ప్రపంచం పై కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన గణాంకాలు అగ్రదేశాల్లో గుబులు రేపుతున్నాయి. ఓమిక్రాన్, డెల్టా వేరియంట్లు బయటపడ్డ నాటినుంచి.. అన్ని దేశాల్లో కరోనా సామజిక వ్యాప్తి ఉదృతంగా ఉన్నట్లు WHO తెలిపింది. ఈ ప్రకారం జనవరి 17-23 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కరోనా కేసులు నమోదు అయినట్లు WHO మంగళవారం విడుదల చేసిన ‘కొవిడ్-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్డేట్’ నివేదికలో పేర్కొంది. ఇది అంతకముందు వారంతో పోల్చితే 5 శాతం ఎక్కువకాగా.. అసలు కరోనా మహమ్మారిగా అవతరించిన నాటి నుంచే వారం వ్యవధిలో 2 కోట్ల కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
Also read: Violent Bihar: బీహార్ లో రైలును తగలబెట్టిన రైల్వే ఉద్యోగార్థులు
ఇక వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అవడంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO..వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లోనే నమోదు అవుతున్నట్లు గుర్తించింది. వారం వ్యవధిలో అత్యధికంగా 50 వేల మరణాలు(కరోనా బారిన పడి) సంబవించినట్లు నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్, భారత్, రష్యా, ఇటలీ దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాలైన భారత్, నేపాల్, బంగ్లాదేశ్లో జనవరి రెండో వారంతో పోల్చితే.. మూడోవారంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు అయినట్లు WHO తన నివేదికలో తెలిపింది. రెండో వారంలో పోల్చితే మూడోవారంలో 36 శాతం కొత్త కరోనా కేసులు పెరగగా, మరణాలు 44శాతం పెరిగినట్లు WHO వెల్లడించింది.