Person Dies From Corona Every 44 Seconds : ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రతి 44 సెకన్లకు ఒకరు మృతి : డబ్ల్యుహెచ్ఓ
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
- bheemraj
- Published On : September 11, 2022 / 07:20 PM IST
WHO Director General Tedros Adhanom
Person Dies From Corona Every 44 Seconds : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైరస్ బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ తీవ్రత తగ్గినా.. ఇప్పటికీ పాజిటివ్ కేసులు నమోదవుతూనేవున్నాయి. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేసన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో క్షీణత కొనసాగుతోందని.. కానీ, ఈ ధోరణి కొనసాగుందనే గ్యారంటీ లేదని చెప్పారు. ఫిబ్రవరి నుంచి మరణాల సంఖ్య 80 శాతానికిపైగా తగ్గిందన్నారు. గత వారంలో 44 సెకన్లకు ఒకరు కరోనాతో చనిపోయారని బ్రీఫింగ్లో పేర్కొన్నారు. ఆ మరణాల్లో చాలా వరకు నివారించదగినవని అన్నారు. మహమ్మారి ఇంకా ముగియలేదని తాను చెప్పడం విని మీరు విసిగిపోయి ఉండవచ్చన్నారు.
ఈ వైరస్ అంతరించిపోదని ఇప్పటివరకు చెప్పానని..ఇంకా చెబుతూనే ఉంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,076 కరోనా కేసులు నమోదవ్వగా, ప్రస్తుతం 47వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ స్పందిస్తూ ఐరోపాలో మంకీపాక్స్ తిరోగమనంలో ఉందన్నారు.
గత వారం అమెరికాలో కేసుల పెరుగుదల క్షీణించినా.. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్పై తీర్మానాలు చేయడం కష్టమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 52,997 మంది మంకీపాక్స్ బారినపడ్డారు. గత నాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 70.7శాతం అమెరికా నుంచి, 28.3శాతం యూరప్ నుంచే ఉన్నాయి.
