Houthis Red Sea Attack : ఎర్ర సముద్రంలో మళ్లీ టెన్షన్.. రెచ్చిపోయిన హౌతీలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం..

Houthis Red Sea Attack : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సౌదీ సైనిక ల్యాండింగ్ షిప్‌తో పాటు నాలుగు ఎస్కార్ట్ బోట్లపై బాలిస్టిక్ క్షిపణులతో హౌతీలు దాడులు చేశారు.

Houthis Red Sea Attack

Houthis Red Sea Attack : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ గ్రూప్.. సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనిక ల్యాండింగ్ నౌకతో పాటు దానికి రక్షణగా ఉన్న నాలుగు ఎస్కార్ట్ బోట్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటన యెమెన్‌లోని నైరుతి తీర ప్రాంతం మోఖా పోర్ట్ సమీపంలోని ఎర్ర సముద్రంలో జరిగినట్లు సమాచారం.

Also Read : CM Revanth Reddy : నల్లమలకు వెళ్లి అలా చేయండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సూచన.. కేటీఆర్‌పై కీలక కామెంట్స్..

హౌతీలు సోమవారం ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించారు. సౌదీ సైనిక ల్యాండింగ్ షిప్‌తో పాటు నాలుగు ఎస్కార్ట్ బోట్లపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపారు. అయితే దాడిలో ఎంత మేర నష్టం జరిగింది, ప్రాణనష్టం ఏమైనా సంభవించిందా అనే విషయంపై పూర్తి వివరాలు వెంటనే వెల్లడికాలేదు.

ఎర్ర సముద్రంలో వాణిజ్య, సైనిక నౌకలపై దాడుల ముప్పు ఇటీవల పెరుగుతోంది. హౌతీలు సౌదీకి సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని గతంలో ప్రకటించారు. జూలైలో సౌదీపై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించిన తర్వాత సౌదీకి అనుబంధంగా ఉన్న ట్యాంకర్లపై దాడులు చేసినట్లు కూడా హౌతీలు ప్రకటించారు. ఇటీవల బాబ్ అల్-మందెబ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు రాయిటర్స్, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ పరిణామాలు ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం..
ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెబ్ మార్గాలు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు. ఈ ప్రాంతంలో దాడుల ముప్పు పెరగడంతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. సౌదీ చమురు ఎగుమతుల విషయంలోనూ భద్రతా ఆందోళనలు పెరిగినట్లు రాయిటర్స్ పేర్కొంది. సౌదీ ప్రయోజనాలకు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించిన నేపథ్యంలో తాజా దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఎర్ర సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల భద్రతపై ఇప్పుడు అంతర్జాతీయంగా మరింత దృష్టి నెలకొంది.