IBPS Recruitments
IBPS Recruitments : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి భారీ శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను సాధించిన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.65,480 వరకు వేతనం లభిస్తుంది. అయితే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ, పరీక్షల విధానం.. అర్హతల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. (IBPS Recruitments)
2025-27 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP) – కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA)-XV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (సీఎస్ఏ) పోస్టులు 10,277 ఉండగా.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1315, మహారాష్ట్రలో 1117, తమిళనాడులో 894, కర్ణాటకలో 1170, గుజరాత్ రాష్ట్రంలో 753, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 601 పోస్టులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 261, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 367 పోస్టులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 500కు తక్కువ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అంతేకాక స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అయితే, ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175, ఇతరులకు రూ.850. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
♦ ఆన్లైన్ దరఖాస్తు తేదీలు : ఆగస్టు 1 నుంచి ఆగస్టు 28 వరకు.
♦ అడ్మిట్ కార్డులు : 2025 సెప్టెంబర్.
♦ ప్రిలిమినరీ పరీక్ష : 2025 అక్టోబర్.
♦ మెయిన్స్ పరీక్ష : 2025 నవంబర్.
♦ ఫలితాలు : 2026 మార్చి.