Security breach: జాతీయ భద్రతా సలహాదారు అజిద్ ధోవల్ భద్రతలో వైఫల్యం కారణంగా ముగ్గురు కమాండోలను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం అజిత్ ధోవల్ నివాసంలోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలేమీ జరగనప్పటికీ ఇది భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగిందని తేలింది. దీంతో ఆయన భద్రతలోని ముగ్గురు సీఐఎస్ఎఫ్ కమాండోలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
దేశంలో ప్రాణాలకు ముప్పుపొంచివుండే వ్యక్తుల్లో జాతీయ భద్రతా సలహాదారు ఒకరు. అందుకే ఆ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు సీఐఎస్ఎఫ్ ‘జడ్ ప్లస్’ భద్రత కల్పిస్తుంది. అయితే అజిత్ ధోవల్ భద్రతలో లోపం ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటపడింది. ఢిల్లీలోని ఆయన నివాసంలోకి చొరబడేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఎస్యూవీ వాహనంతో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది కారుని నిలువరించడంతో అవాంఛనీయ ఘటనేమీ జరగలేదు. ఆ తర్వాత నిందితుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఫల్యం కారణంగానే ఇదంతా జరగడంతో ధోవల్ భద్రత నుంచి ముగ్గురు కమాండోలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్, కమాండెంట్లను బదిలీ చేసినట్టు వివరించాయి. ఫిబ్రవరి 2022లో ధోవల్ నివాసం వద్ద భద్రతా లోపం జరిగినట్టు తేలిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు శాంతాను రెడ్డి. ఇతడు బెంగళూరు నివాసి. తన శరీరంలో ఒక చిప్ ఉందని, బయట వ్యక్తులు తనను నియంత్రిస్తున్నారని అతడు చెప్పాడు. కానీ ఎంఆర్ఐ స్కానింగ్లో ఎలాంటి చిప్ లేదని తేలింది. మానసిక స్థితి సరిగాలేనట్టుగా ఉన్నాడని అధికారులు తెలిపారు. రెడ్ కలర్ కారుని నోయిడాలో అద్దెకు తీసుకున్నాడు.