South African Leopards: వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దక్షిణాఫ్రికా నుంచి మరో ఎనిమిది పులులను మన దేశానికి తీసుకురానున్నారు. అత్యంత వేగంగా పరుగెత్తడం చిరుత పులుల స్పెషల్. ఒకప్పుడు మన దేశం ఇలాంటి చిరుతలకు ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అడవులు నాశనం చేయడంతో ఇప్పుడు వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా అంతరించిపోతుంది. అందుకే ఇతర దేశాల నుండి చిరుతలను మనదేశానికి రప్పిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని ఆన్ వాన్ డైక్ చిరుతల కేంద్రం నుంచి గత ఏడాది మైసూర్లోని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్కు మూడు చిరుతలు తీసుకొచ్చారు. వీటిలో ఒకటి మగది కాగా మరో రెండు ఆడ చిరుతలు. 14 నుంచి 16 నెలల వయస్సున్న ఈ మూడు చిరుత పులులను జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా జోహన్నస్బర్గ్ నుంచి వాయుమార్గంలో వీటిని అప్పుడు బెంగళూరుకు తీసుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఈ ఏడాది నవంబర్లో 8 చిరుత పులులు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురానున్నారు. వాటిల్లో అయిదు మగ, మూడు ఆడ చిరుతలు ఉండనున్నాయి.
గంటకు 70 మైళ్ల వేగంతో పరిగెత్తగలిగే ఈ చిరుతలు ప్రస్తుతం సౌతాఫ్రికా, నమీబియా, బోట్సవానాలో విరివిగా ఉన్నాయి. మొత్తం ఏడు వేల చీతాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. కాగా ఇప్పుడు సౌతాఫ్రికా నుండి చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉన్న అడవులను చిరుతల కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఇండియాకు రానున్న ఈ ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్, రాజస్థాన్లోని ముకుంద్ర హిల్స్లో పెంచనున్నారు.